CM Chandrababu: సెంటిమెంట్ పేరుతో పాలిటిక్స్ కరెక్టు కాదని సీఎం చంద్రబాబు అన్నారు. నీళ్లవిషయంలో రాజకీయాలు చేయొద్దని తెలంగాణను కోరుతున్నా అని తెలిపారు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిది. దేవాదుల, కల్వకుర్తి నేనే ప్రారంభించా. ఆర్డీఎస్లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి హైదరాబాద్కు ఇచ్చాం. పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదు. మిగిలిన నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. పోటీపడి మాట్లాడటం సరికాదు అని సీఎం అన్నారు.
పోలవరానికి సంబంధించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. 2020 నాటికి పూర్తి కావలసిన పోలవరం ప్రాజెక్ట్, వైసీపీ ప్రభుత్వం రాకతో వారి చేతకానితనం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడంలో ఆరేడేళ్లు జాప్యం జరిగిందని అన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారన్నది కూడా ఎంక్వైరీ చేయాల్సిందే అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. దీంతో పాటు వైసీపీ హయాంలో కనీసం డయాఫ్రం వాల్ను కాపాడుకోలేకపోయారని ఆయన విమర్శించారు. నిపుణులు సూచనలతో నిర్మిస్తున్న కొత్త డయాఫ్రం వాల్ పనులు ఈ ఫిబ్రవరి 15కల్లా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరం, జీవనాడి అని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం గ్యాప్ -1 లో పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్యాప్ -2లో అప్స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రైట్ కనెక్టివిటీలో 19 మీటర్లు వెడల్పు, ఎత్తులో రెండు టన్నెల్లు వస్తాయి. విశాఖకు నీరు తీసుకెళ్లే కాలువను బాగా వెడల్పు చేశాం. పోలవరం నీటితో అనకాపల్లి, విశాఖ జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం అని తెలిపారు.
అనంతరం సీఎం చంద్రబాబు అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని.. గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని సూచించారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చెప్పారు. కుడికాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు చేయాలన్నారు చంద్రబాబు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని తనిఖీ చేస్తానని సీఎం వెల్లడించారు.

Share