Bio Bitumen: రైతులు పంట కోశాక మిగిలిన గడ్డిని, చెత్తను ఏం చేయాలో తెలియక తగలబెడుతుంటారు. కానీ ఇకపై అదే చెత్త రైతులకు కాసుల వర్షం కురిపించబోతోంది. గడ్కరీ చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటంటే.. వాణిజ్య అవసరాల కోసం ‘బయో-బిటుమెన్’ (Bio-Bitumen)ను ఉత్పత్తి చేయడంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. భారత రోడ్డు మౌలిక సదుపాయాల రంగంలో ఈరోజు ఒక చారిత్రాత్మక మైలురాయి నమోదైందన్నారు.
ఈ అద్భుతమైన ఆవిష్కరణ వెనుక ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) శాస్త్రవేత్తలకు గడ్కరీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “వ్యవసాయ వ్యర్థాల నుండి రోడ్డు వరకు: పైరోలిసిస్ ద్వారా బయో-బిటుమెన్” అనే వారి పరిశోధన.. రైతుల పొలాల్లో మిగిలిపోయే వ్యర్థాలను ఎలా జాతీయ వనరుగా మార్చవచ్చో నిరూపించిందన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు.
సాధారణ బిటుమెన్ (తారు)లో 15 శాతం మేర ఈ బయో-బిటుమెన్ను కలపడం (Blending) ద్వారా భారతదేశానికి ఏటా సుమారు రూ. 4,500 కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని గడ్కరీ వెల్లడించారు. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందన్నారు.
వ్యవసాయ వ్యర్థాలను ఇలా రోడ్ల నిర్మాణానికి వాడటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, రైతులకు కొత్త ఆదాయ మార్గాలు (జీవనోపాధి) లభిస్తాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం కలలుగంటున్న ‘వికసిత్ భారత్-2047’ సాధనలో, వృత్తాకార ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇదొక విప్లవాత్మక ముందడుగు అని ఆయన అభివర్ణించారు.
బిటుమెన్ అంటే మనం రోడ్లు వేయడానికి వాడే నల్లటి ‘తారు’. సాధారణంగా దీనిని ముడి చమురు (Crude Oil) శుద్ధి చేసేటప్పుడు తీస్తారు. కానీ, ఇప్పుడు సరికొత్తగా వ్యవసాయ వ్యర్థాలు, గడ్డి నుంచి ఈ బయో-బిటుమెన్ ను తయారు చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, రోడ్ల నాణ్యత, మన్నిక కూడా పెరుగుతుంది. విదేశాల నుంచి చమురు దిగుమతులు తగ్గి, మన రైతులకు ఆదాయం లభిస్తుంది.