రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్రంలో వృధాగా కలిసే నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నామని వివరించారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని.. అదేవిధంగా నల్లమల సాగర్ విషయంలో పొరుగు రాష్ట్రం సహకరించాలని కోరారు.
గంగ-కావేరి నదుల అనుసంధానం తన చిరకాల కోరిక అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రంలో నీటి సమస్య శాశ్వతంగా తీరాలంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వంశధార నుంచి పెన్నా వరకు అనుసంధాన ప్రక్రియ పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ బృహత్తర కార్యం పూర్తయిన తర్వాత తెలుగు తల్లికి జలహారతి ఇస్తామని వ్యాఖ్యానించారు. తన హయాంలో రెండోసారి పుష్కరాలు రాబోతున్నాయని.. వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.
రాయలసీమ అభివృద్ధిపై స్పందిస్తూ.. ఆ ప్రాంతం రాళ్లసీమగా మారకుండా దిశానిర్దేశం చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. గాలేరు-నగరి, తెలుగుగంగ వంటి కీలక ప్రాజెక్టులు ఆయన చొరవతోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. సీమ వాసులకు సాగునీరు అందించిన తర్వాతే చెన్నైకి నీళ్లు తరలించారని వివరించారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాజెక్టులు గతంలో ఎన్డీయే, ఎన్టీఆర్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గడువు విధించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 14 వారాల సమయం కేటాయించామని.. పురోగతిపై ప్రతి వారం నివేదికలు సమీక్షిస్తానని చెప్పారు. జూలై నాటికి వెలిగొండ ఫేజ్-1 నుంచి నీళ్లు విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. గత పాలకులు పనులు పెండింగ్లో పెట్టి హడావుడి చేశారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు.. శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీటిని తరలించి రైతాంగాన్ని ఆదుకున్నామని వివరించారు. ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులను ప్రస్తుత పదవీ కాలంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. పుష్కరాల కంటే ముందే ఈ ప్రాజెక్టును ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని స్పష్టం చేశారు. సముద్రంలో వృధాగా కలిసే నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నామని వివరించారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని.. అదేవిధంగా నల్లమల సాగర్ విషయంలో పొరుగు రాష్ట్రం సహకరించాలని కోరారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ధ్యేయంగా టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని ముందుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ALSO READ: Rahul Gandhi: మోదీ జీ.. ఇది భారతదేశం.. ఉత్తర కొరియా కాదు.. రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు