Amaravati: ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత అధికారుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. సరిగా పాలన లేకుంటే ప్రజలు ఆమోదించే అవకాశం లేదని తేల్చేశారు. ఇందుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏడవ కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.
కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సదస్సు ప్రారంభంలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చినందుకు మంత్రులు, అధికారులకు అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఆ విజయం తనది కాదని, గ్రామ స్థాయి నుంచి మంత్రులు, అధికారుల వరకు అందరి సమష్టి కృషి ఫలితమన్నారు.
పాలనపై తన దార్శనికత, ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి వివరించారు. గత పాలనలో రాష్ట్రం ఆర్థికంగా డ్యామేజ్ జరిగిందని, రూ. 9 లక్షల కోట్లపైగానే అప్పులు సంక్రమించాయన్నారు. కేంద్ర పథకాల నిధులను దారి మళ్లించిందని, చెల్లించాల్సిన బిల్లులను మనపై రుద్దినట్టు వివరించారు.
వంద శాతం ఫిర్యాదు పరిష్కారం కావాల్సిందే.. ఇకపై రోజుకొకటి శంకుస్థాపన
పాలనలో జవాబుదారీ తనం అత్యంత ముఖ్యమన్న సీఎం, ప్రజల నుంచి వచ్చే ఆర్థికేతర ఫిర్యాదులు 100 శాతం పరిష్కరించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ విషయంలో కొందరు అధికారులు వైఖరి మారాలని తేల్చిచెప్పేశారు. ఆర్థికపరమైన ఫిర్యాదులపై వెంటనే విచారణ జరిపి పరిష్కరించాలని సూచించారు.
వచ్చే ఏడాది మార్చికి రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందేనని చెప్పేశారు. అదే సమయంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఒకప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే గొప్పగా భావించేవాళ్లమని గుర్తు చేశారు. ఆ సంస్థ ఇప్పుడు ఏపీకి వచ్చిందన్నారు.
ALSO READ: తెగేదాక లాగిన వర్మ.. పిఠాపురం జనసేనదే!
ఇదేకాకుండా ప్రపంచ స్థాయి కంపెనీలైన గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వచ్చాయని గుర్తు చేశారు. దాదాపు రూ.23 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నామని, అవన్నీ సాకారమైతే దాదాపు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు.
గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్తోపాటు డేటా, ఏఐ, క్వాంటం టెక్నాలజీలకు ఏపీ హబ్గా మారబోతోందన్నారు. దేశంలో అతిపెద్ద కంపెనీలు ఏపీకి రానున్నాయని, వారానికో కంపెనీ వస్తాయన్నారు. రోజుకొకటి శంకుస్థాపన చేస్తున్నామని, ప్రజల కోసం పని చేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.