Chandrababu Naidu: అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ శిక్షణ తరగతుల్లో ఒక సామాన్య కార్యకర్తలా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ కమిటీల నుంచి ఎంపికైన 1050 మంది సభ్యుల కోసం నిర్వహించిన ఈ వర్క్ షాప్ కు సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు.
శిక్షణ జరుగుతున్న గదుల్లోకి వెళ్లిన చంద్రబాబు, ఏమాత్రం హడావుడి లేకుండా చివరి వరుసలో కూర్చుని నాయకులు చెప్పే అంశాలను శ్రద్ధగా విన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సాధారణ సభ్యునిలా ఆయన ఒదిగిపోయిన తీరు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా పార్టీ ఐడియాలజీ, క్యాడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నాలుగున్నర దశాబ్దాల పార్టీ ప్రయాణాన్ని గుర్తు చేస్తూనే, కూటమి ప్రభుత్వ విజన్, సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలను నాయకులకు వివరించారు.
నూతనంగా ఎంపికైన పార్లమెంట్ అధ్యక్షులకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు హాజరైన చంద్రబాబు, శిక్షణ జరుగుతున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. “కార్యకర్తే అధినేత” అనే సిద్ధాంతానికి కట్టుబడి ప్రతి నాయకుడు పనిచేయాలని, ప్రజల చెంతకు ప్రభుత్వ విజయాలను తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
మరోవైపు మంత్రి నారా లోకేష్ ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉండి, ప్రతి గదిలోకి వెళ్లి కార్యకర్తలతో ముచ్చటించారు. ఒక్కో పార్లమెంట్ కమిటీ నుంచి వచ్చిన 42 మంది సభ్యుల బృందాలతో ఆయన సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్టీ సిద్ధాంతాలపై శిక్షణ పొందుతున్న నాయకులతో సీఎం చంద్రబాబు నేరుగా మాట్లాడి వారిలో స్ఫూర్తిని నింపారు.
అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ క్రమశిక్షణ గల కార్యకర్తలా చంద్రబాబు వ్యవహరించిన తీరు తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని వర్క్ షాప్ కు హాజరైన సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం సాధిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడమే లక్ష్యంగా ఈ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది.
Read Also: సిగరెట్ లైటర్ కోసం గొడవ.. ప్రాణ స్నేహితుడే కాలయముడయ్యాడు.. ఇంత ఘోరమా!