CM Chandrababu Naidu: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్పీజీ (LPG) గ్యాస్ నిల్వలు, సరఫరా వ్యవస్థపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. యుద్ధ ప్రభావం వల్ల రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 4 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం వివిధ కంపెనీల వద్ద 21,505 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
గ్యాస్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించడానికి మరియు ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితులను అంచనా వేయడానికి ముగ్గురు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని సీఎం నియమించారు. ఈ కమిటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ సభ్యులుగా ఉంటారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా ఆయా శాఖల అధికారులు నిరంతరం మానిటర్ చేస్తూ ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆస్పత్రులకు ఎల్పీజీ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకూడదని ఆయన స్పష్టం చేశారు.
యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోయిన గుడ్లు, అరటి వంటి ఉద్యాన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలకుండా నిఘా పెట్టాలని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 1.61 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు, 10 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థల నుంచి సరఫరాను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించాలని సీఎం సూచించారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ గ్యాస్ ధరలు అదుపులో ఉండేలా చూడటం అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్లో అనవసర భయాందోళనలు కలగకుండా వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరించాలని అధికారులను కోరారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం సమన్వయంతో పనిచేస్తూ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.