Jogi Ramesh: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి తనను టార్గెట్ చేసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. ప్రభుత్వం రాగానే తన కుమారుడిపై కేసు నమోదు చేశారని.. నకిలీ మద్యం కేసులో తనను, తన తమ్ముడ్ని 83 రోజులు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా తన ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేయించారని మండిపడ్డారు. ఇప్పుడు తన కుమారుడి వ్యక్తిగత వ్యవహారాన్ని సైతం రోడ్డుకు ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు గుంటూరు ఇరిగేషన్ భూముల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్దమని సవాలు విసిరారు.
గుంటూరు ఇరిగేషన్ భూముల వ్యవహరంపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించాలని సీఎం చంద్రబాబుకు జోగి రమేశ్ విజ్ఞప్తి చేశారు. అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో తనపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన గొంతు నొక్కడం ఎవరి వల్ల కాదని అన్నారు. అప్పులు తీర్చుకోవడానికి తనకు ఉన్న భూములను అమ్ముకుంటున్నానని.. గుంటూరు ఇరిగేషన్ ల్యాండ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై కక్ష ఇంకా తీరకపోతే ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలని సవాలు విసిరారు.
Also Read: యురేనియం డీల్, ఫ్రీ వీసా, పౌర పురస్కారం.. ప్రధాని ఉజ్బెకిస్థాన్ పర్యటన సూపర్ హిట్!
మరోవైపు తన భార్య బైబిల్ చదవడంపై వస్తున్న విమర్శలపైనా మరోమారు జోగి రమేశ్ స్పందించారు. ‘నా భార్య బైబిల్ చదివితే తప్పేంటి’ అని నిలదీశారు. ‘నాతో పాటు నా భార్య కూడా ఆలయాలకు వస్తుంది. మొన్ననే నేను నా భార్య కాశీ విశ్వేశ్వరుడి వద్దకు వెళ్లొచ్చాం. మూడేళ్ల క్రితం నా ఇంట్లో జరిగిన ఛండీయాగంలో నా భార్య, నేను పాల్గొన్నాం. 76 ఏళ్ల వయసులో ఉండి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చంద్రబాబును కోరుతున్నా’ అంటూ జోగి రమేశ్ విజ్ఞప్తి చేశారు.
Also Read: అప్పటి ప్రజలతో.. రాముడు, కృష్ణుడు ఏ భాషలో మాట్లాడేవారు? బయటపడ్డ అసలు నిజం!