CM Chandrababu: సీఎం చంద్రబాబు హస్తిన బాట పట్టనున్నారా? రెండురోజుల్లో బడ్జెట్ సమావేశాలు కానున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టూర్ వెనుక అసలు కారణాలేంటి? రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాట అలా ఉంచితే, లడ్డూ కేసు, రాజ్యసభ సీట్ల విషయంలో చర్చించేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది.
సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఏపీలో ఈనెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. 14న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి దాదాపుగా అన్ని పనులు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. ఉన్నట్లుండి సీఎం చంద్రబాబు హస్తినకు వెళ్లడంపై రకరకాలుగా ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు ముఖ్యమంత్రి. మంగళవారం ఉదయం 10 గంటలకు కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ఆయన నివాసంలో భేటీ కానున్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఒంటి గంటకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో పార్లమెంట్లో భేటీ కానున్నారు.
ఆ రెండు అంశాలపై ప్రధానంగా చర్చ అంటూ వార్తలు
మధ్యాహ్నం మూడు గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్, నాలుగు గంటలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం అవుతారు. దీనికి సంబంధించి ఆ పార్టీ నేతలు ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి టూర్పై పార్టీ వర్గాల వెర్షన్ మరోలా ఉంది.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇటీవల సీబీఐ సిట్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాని ప్రకారం అధికారులు, రాజకీయ నేతలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. మే నాలుగు రాజ్యసీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో దానిపై కూడా చర్చించనున్నట్లు చెబుతున్నారు.
ALSO READ: వైసీపీని భయపెడుతున్న మున్సిపల్ ఎన్నికలు?
ఈ రెండు విషయాలపై సీఎం చంద్రబాబు-డిప్యూటీ పవన్ కల్యాణ్ ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురు ఏయే అంశాలు చర్చించారో తెలీదు. ఇది జరిగి నాలుగు రోజుల తర్వాత సీఎ చంద్రబాబు హస్తినకు వెళ్లడం వెనుక ఇదే కారణమని అంటున్నారు. ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఆయా మంత్రులతో చర్చించనున్నారు సీఎం.