ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తున్నది. ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఈ మేరకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. మార్చి 9వ తేదీని ఓటరు జాబితాను ప్రకటించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత వార్డులు, డివిజన్ల వారీగా ఓటరు జాబితా సవరణ, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలకు రిజర్వేషన్ల ఖరారు చేయనుంది. రిజర్వేషన్ల ఖరారు అనంతరం ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎస్ఈసీకి లేఖ వస్తే.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే కోడ్ అమల్లోకి రానుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ తేదీలు సైతం ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అయితే, మున్సిపల్ ఎన్నికల కోసం అధికార కూటమి సర్కార్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 125 పట్టణ స్థానిక సంస్థలు (ULBs) ఉన్నాయి. ఇందులో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు మరియు 30 నగర పంచాయతీలు ఉన్నాయి. 26 జిల్లాల పరిధిలో ఇవి పరిపాలన సాగిస్తున్నాయి. అందులో మేజర్ మున్సిపల్ కార్పొరేషన్లు అనంతపురం, చిత్తూరు, రాజమహేంద్రవరం, ఏలూరు, గుంటూరు, మంగళగిరి తాడేపల్లి, కడప, కాకినాడ మొదలైనవి ఉన్నాయి. అయితే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నాయి. ఆయా పార్టీలు పొత్తులో భాగంగా సీట్ల షేరింగ్ జరగనుంది. ఇందులో మెజార్టీ స్థానాలు టీడీపీ, జనసేనకు వెళ్తాయని తెలుస్తోంది. అయితే, ఎన్నికల్లో కలిసే పోటీకి దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మెజార్టీ కార్పొరేషన్లు మున్సిపాలిటీలపై కూటమి సర్కార్ కన్నేయగా.. అందుకోసం వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్ల ఖరారుకు ముందే అభ్యర్థులను క్షేత్రస్థాయిలోకి పంపించి ప్రభుత్వం చేస్తున్న మంచి, అభివృద్ధి, సంక్షేమంపై ఓటర్లకు వివరించాలని ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇక ప్రతిపక్ష వైసీపీ మాత్రం మున్సిపల్ ఎన్నికల ప్రిపరేషన్లో వెనుకబడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరో మాజీ మంత్రి ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చారు. మిగతా కీలక నేతలు ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసుల భయంతోనే వారు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా సైలెంట్ అయినట్టు సమాచారం.
Sama Ram Mohan Reddy: వయసు పెరిగిందే తప్పా.. కేటీఆర్ బుర్రలో గుజ్జు లేదు.. సామ రామ్మోహన్ ఫైర్
దీనికి తోడు వైసీపీ నేతల దురుసుతనం వలన ఎవరో ఒకరు కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఫలితంగా మాజీ సీఎం జగన్.. వారి కుటుంబాలను పరామర్శించే బిజీలో ఉండిపోయారు. మున్సిపల్ ఎన్నికల మీద ఆయన పెద్దగా ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది. అయితే, వైసీపీ శ్రేణులు మాత్రం ఈ ఎన్నికల్లో ఎలా సత్తా చాటాలో తెలియక అయోమయంలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. సాధారణంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణం. ఇదే సెంటిమెంట్ వైసీపీ శ్రేణులు, నాయకులను భయానికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల వైసీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడి ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. అప్పట్లో టీడీపీ ఈ విషయంపై పెద్దఎత్తున ఆరోపించింది. కానీ, ఇప్పుడు ఆ చాన్స్ లేకపోవడంతో వైసీపీ నేతలు సైలెంట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది.