CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎయిడ్స్ వ్యాధి నివారణ, అవగాహన కార్యక్రమాలపై కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుమారు 30 ఏళ్ల క్రితం రాష్ట్రంలో హెచ్ఐవీ-ఎయిడ్స్ కేసుల తీవ్రత ఏ విధంగా ఉండేదో ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పరిస్థితిని అంచనా వేసి, ప్రజల్లో అవగాహన పెంచేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన వినూత్న చర్యలు, వాటి ఫలితాలను సీఎం వివరించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.
సుమారు మూడు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో ఎయిడ్స్ కేసుల సంఖ్య అధికంగా ఉందన్నారు. అప్పటి పరిస్థితులను వివరిస్తూ.. ఆ సమయంలో హైవేల మీద ఎటు చూసినా కండోమ్స్ కనిపించేవని సీఎం వ్యాఖ్యానించారు. ఈ దృశ్యం రాష్ట్రంలో సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేసేదన్నారు. ఆ సమయంలోనే హెచ్ఐవీ వ్యాప్తి తీవ్రతను తాను గుర్తించానని, దీనిపై వెంటనే పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడం తక్షణ కర్తవ్యంగా భావించామన్నారు.
ఈ సమస్య ప్రాధాన్యతను ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడం కోసం తాను ఒక వినూత్న కార్యక్రమం చేపట్టానన్నారు. అప్పట్లో అసెంబ్లీని ప్రత్యేకంగా అలంకరింపజేశామని తెలిపారు. ఎయిడ్స్పై అవగాహన కల్పించడానికి, ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి గురించి తెలియజేయడానికి ఆ ప్రయత్నం దోహదపడింది. నాడు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగపడ్డాయని.. ఆ చర్యల ఫలితంగానే రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయని సీఎం వివరించారు.
వ్యాధి నివారణ చర్యలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హెచ్ఐవీ-ఎయిడ్స్ సమస్యను రాష్ట్రం నుంచి పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ను ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామనే లక్ష్యాన్ని ఆయన ప్రకటించారు. ప్రజలు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో ఈ దిశగా మరింత సమర్థవంతమైన కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.