Jagan : ఏపీ ప్రభుత్వం డిజిటల్ విద్యపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెడుతోంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను తాను చూశానని సీఎం అన్నారు. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసిందన్నారు. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలన్నారు. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయని చెప్పారు. భావి తరాల పిల్లల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం ట్యాబ్లలో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి విద్యార్థులకు అందిస్తోంది. 5,18,740 ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేస్తోంది. మొత్తం 4,59,564 మంది విద్యార్థులకు 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా 9,703 స్కూళ్లలో ట్యాబ్ల పంపిణీ చేపడుతున్నారు. ట్యాబ్ ల కోసం ప్రభుత్వం రూ.686 కోట్లు ఖర్చు చేస్తోంది.
నెట్తో సంబంధం లేకుండా ట్యాబ్ లో విద్యార్థులు పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు ఉంది. బైజూస్ లెర్నింగ్ యాప్ లో లెక్కలు, ఫిజిక్స్, జువాలజీ, బయాలజీ, జియాలజీ, సివిక్స్, హిస్టరీ పాఠ్యాంశాలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీతోపాటు 8 భాషల్లో పాఠ్యాంశాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులకు అర్థమయ్యేలా 2 నుంచి 4 నిమిషాల నిడివితో యానిమేషన్, వీడియోల రూపంలో పాఠ్యాంశాలను పొందుపర్చారు. బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్లో మొత్తం 57 చాప్టర్లు, 300 వీడియోలు ఉన్నాయి. ట్యాబ్లపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇప్పటికే ఐటీ విభాగం అవగాహన కల్పించింది.