Janasena Avanigadda MLA Candidate(AP elections news): జనసేనలో అవనిగడ్డ అగ్గి రాజేసింది. పొత్తులో ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. అయితే అభ్యర్థిని మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించలేదు. జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో 19 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. కానీ అవనిగడ్డ అభ్యర్థిని మాత్రం ఎంపిక చేయలేదు. అభ్యర్థి ఎవరనే చర్చ జరగుతున్న సమయంలో తెరపైకి మండలి బుద్ధ ప్రసాద్ పేరు వచ్చింది.
ఇప్పటివరకు టీడీపీలో ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ జనసేన కండువా కప్పుకున్నారు. అయితే ఆయన రాకను స్థానిక జనసేన నాయకత్వం వ్యతిరేకిస్తోంది. మరోవైపు జనసేన టిక్కెట్ బుద్ధ ప్రసాద్ కే దక్కుతుందని ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన పార్టీలో చేరారని తెలుస్తోంది.
అవనిగడ్డలో తొలి నుంచి జనసేనలో ఉన్న నేతలు మండలి బుద్ధప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన నేతకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వేరే నాయకుడికి జనసేన టిక్కెట్ ఇస్తే సహించేదిలేదంటున్నారు. ప్రాణ త్యాగానికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం పార్టీకి పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: విశాఖ సౌత్ బరిలో వంశీకృష్ణ శ్రీనివాస్ .. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన..
ఎంత రాద్ధాంతం జరిగినా మండలి బుద్ధ ప్రసాద్ కే జనసేన చిక్కెట్ దక్కుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఆయనకు టిక్కెట్ పై హామీ లభించిన తర్వాతే పార్టీలో చేరారని సమాచారం. మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కూడా బుద్ధప్రసాద్ కే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారనే చర్చ నడుస్తోంది. ఆయనే మండలి బుద్ధప్రసాద్ ను పార్టీలోకి తీసుకొచ్చారని అంటున్నారు. మరి జనసేనాని పవన్ కల్యాణ్ అవనిగడ్డ అగ్గిని ఎలా చల్లారుస్తారో చూడాలి.