CPI Protest: గత ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్లస్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, సాగుభూమి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీవో, మండల, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిర్వహించే ఆందోళనలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ప్రజలకు ఇళ్లు, ఇళ్లస్థలాలు, పెన్షన్లు, రేషన్కార్డులు ఇస్తామని పలు హామీలు గుప్పించారు. కాని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆయా హామీల అమలుపట్ల తాత్సార వైఖరి ప్రదర్శిస్తున్నది.
టిడ్కో ప్రాజెక్టు కింద 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ, దాదాపు 8 సంవత్సరాలు గడిచినా వాటిని ఇప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందించలేదు. టిడ్కో ఇళ్లను ఈ ఉగాదికి ఇస్తామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి, ఎక్కడా లబ్ధిదారులకు స్వాధీనపరచకుండా ఉగాది పేరుతో కాలయాపన చేసింది. ఇలా ఎన్ని పండగల పేరుచెప్పి లబ్ధిదారులను మభ్యపెడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పేదలకు కేటాయించే ఇళ్ల స్థలాల మంజూరు విషయంలో కూటమి ప్రభుత్వం పలు రకాల షరతులు విధిస్తూ జివో నెం:23 ద్వారా కాలయాపన చేస్తోంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్లస్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంత్యోదయ పథకంలో దేశవ్యాప్తంగా సుమారు 30 శాతం కుటుంబాలు పేదరిక రేఖ (బిపిఎల్) కింద జీవనం సాగిస్తున్నాయి. అలాంటి పేద కుటుంబాలకు నివాసం కల్పించడం ప్రభుత్వపు ప్రాథమిక బాధ్యతగా గుర్తెరగాలి. కేరళ ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో భాగంగా ఇల్లు లేని కుటుంబాలకు ఇళ్లు నిర్మించే మంచి నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఎపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇల్లు లేని పేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలి డిమాండ్ చేశారు.
Also Read: Royal Enfield Classic 650: పైసా లేకున్నా రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 650 కొనొచ్చు, ఎలాగో తెలుసా?
లేనిపక్షంలో కనీసం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను సముచితంగా కేటాయించాలి. బిపిఎల్ కింద సొంత ఇల్లు లేని కుటుంబాలు ప్రస్తుతం అద్దె ఇళ్లలో నివసిస్తున్నందున, అటువంటి కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకుఇళ్ల అద్దెను ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం గతంలో ప్రకటించిన రూ.4 లక్షల ఆర్థిక సహాయం ఒక్కో ఇంటి నిర్మాణానికి ఏమత్రం సరిపోదు. అందుకోసం గత మూడు బడ్జెట్లలో నిధులు కూడా కేటాయించలేదు. ఇనుము, సిమెంట్, ఇసుక వంటి నిర్మాణ సామాగ్రి ధరలు, కూలీల వేతనాలు కూడా పెరిగిన నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి కనీసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలి. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, వాటిపై సరైన పరిశీలన లేకపోయింది. అర్హులైన వారిని కొత్తగా పెన్షన్ జాబితాలో చేర్చడం లేదు. ప్రస్తుతమున్న పెన్షన్లను తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది., భూమిలేని నిరుపేదలకు సాగుభూమి పంపిణీ చేయాల
గత రెండు సంవత్సరాల్లో 5,38,634 పెన్షన్లు తొలగించారు. మరో 7,45,993 పెన్షన్లను తొలగించే ప్రణాళికలో ప్రభుత్వం ఉండడం విచారకరం. దివ్యాంగులకు పెన్షన్ల మంజూరు చేయకుండా పలురకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీ ఇప్పటికీ అమలులోకి రాలేదు. పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్లస్థలాలు కేటాయించాలని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, భూమిలేని నిరుపేదలకు సాగుభూమి పంపిణీ చేయాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని, అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేదలకు ప్రభుత్వమే ఇంటి అద్దె చెల్లించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని, అర్హులైన వారందరికీ రేషన్కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళిత, గిరిజన వాడల్లో శ్మశాన వాటికలు లేని ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణమే స్థలాలను కేటాయించి అవసరమైన సౌకర్యాలను కల్పించాలనే తదితర డిమాండ్లతో ఈ నెల 24వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా చేపట్టనున్న ఆందోళనలలో ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం అని అన్నారు.
Also Read: Trump Iran war: ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ విషయంలో సడన్ నిర్ణయం వెనుక అసలు గుట్టు ఇదే!