CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై, ఏపీలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణలో కీలకమైన అణువ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం దేశానికి తీరని నష్టమని హెచ్చరించారు. ప్రస్తుతం అణుశక్తిని ప్రజా ప్రయోజనాల కంటే విధ్వంసకర చర్యలకే ఎక్కువగా వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని, దేశంలో అంతా మోదీనే అనే భ్రమను కల్పించేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలను నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. 2014 తర్వాతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఆమె మాట్లాడటం అవివేకమని, మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రూ.28 లక్షల కోట్లను దోచిపెట్టిందని ఆరోపించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్లను సంఘ విద్రోహశక్తులతో పోల్చడం పవన్ మూర్ఖత్వానికి నిదర్శనమని, ఆయన తన హోదాకు తగ్గట్టుగా ప్రవర్తించాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ఢిల్లీ వెళ్లడాన్ని నారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సింది పోయి, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ‘భిక్షాటన’ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు అడగడం కోసం ఇలా తిరగడం ఆయన అసమర్థతకు నిదర్శనమని నారాయణ విమర్శించారు.