Cyclone in Bay of Bengal(Latest News Updates) : బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడబోతోంది. ఈనెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. అది ఈ నెల 7న అల్పపీడనంగా మారి, 8న వాయుగుండంగా బలపడుతుంది. ఆ వాయుగుండం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తర దిశగా పయనిస్తూ తుపాన్ గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఉత్తర ఈశాన్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఈనెల 10కల్లా తీవ్ర తుపాన్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్, మయన్మార్ తీరం దిశగా వెళుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాన్ కు మోకాగా అని నామకరణం చేశారు. మోకా అనేది
యెమెన్ దేశంలోని పోర్టు నగరం పేరు.
తుపాన్ మరింతగా బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్ పశ్చిమ బెంగాల్, మయన్మార్ల వైపు పయనిస్తుందని అంటున్నారు. గతంలో మే నెలలో సంభవించిన తుపాన్ లు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చాయి. ఏటా మే నెలలో ఒకట్రెండు తుపాన్ లు వస్తుంటాయి.
గత ఏడాది బంగాళాఖాతంలో మే మొదటి వారంలో ‘అసని’ తుపాన్ ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు 4 రోజులు ముందుగా కేరళలోకి ప్రవేశించడానికి ఇది దోహదపడింది. ఇది మచిలీపట్నం – నర్సాపుర మధ్య తీరాన్ని దాటింది. 2021 మే రెండో వారంలో అరేబియా సముద్రంలో టౌక్టే తుపాన్ ఏర్పడి బంగాళాఖాతంలో రుతుపవనాల ఆగమనానికి తోడ్పడింది. అదే ఏడాది మే 23న బంగాళాఖాతంలో యాస్ తుపాన్ సంభవించింది. ఇది ఒడిశాలోని బాలసోర్ వద్ద తీరం దాటింది. 2020 మే 16న బంగాళాఖాతంలోనే అంఫన్ తుపాన్ ఏర్పడింది. ఇది పశ్చిమ బెంగాల్లో తీరాన్ని దాటింది.
సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్లో బంగాళాఖాతం లో తుపాన్ లు ఏర్పడుతుంటాయి. మేలో వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో అక్టోబర్-డిసెంబర్ మధ్య తిరోగమన రుతుపవనాల ప్రభావంతో మరో తుపాన్ సీజన్ ఉంటుంది. వీటికి తోడు పశ్చిమతీరంలోని అరేబియాసముద్రంలోనూ తుపాన్ లు వస్తుంటాయి.
మరోవైపు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తమిళనాడు, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అరేబియన్ సముద్రం వైపు నుంచి గాలులు తోడవడంతో ఏపీలో భారీ వర్షాలు కొనసాగే అవకాశంఉంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎడతెగని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మండు వేసవిలో వర్షా కాలాన్ని మించి వానలు పడుతున్నాయి. విశాఖ, అనకాపల్లి, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో అత్యధికంగా 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.