DCCB UPI Services: సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (DCCB) తొలిసారిగా యూపీఐ సేవలు ప్రారంభించింది. సోమవారం నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు వాణిజ్య బ్యాంకుల్లోని అకౌంట్లకు మాత్రమే అమల్లో ఉండేది.
ఇకపై సహకార బ్యాంకుల్లోని అకౌంట్లకు యూపీఐ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా రైతులకు ఇది ఉపయోగపడనుంది. పొగాకు, ఆయిల్పామ్, కోకో రైతుల లావాదేవీలు కమర్షియల్ బ్యాంకులలో ఎక్కువగా జరుగుతున్నాయి. సరకు విక్రయ లావాదేవీలు ఆన్ లైన్ లో జరుగుతుండడంతో.. ఆ సేవలు అందుబాటులో ఉన్న బ్యాంకుల్లోనే రైతులు లావాదేవీలు చేస్తు్న్నారు.
రైతులు ఎక్కువగా ఖాతాలు తీసుకునే సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో.. వారికి ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
యూపీఐ సేవలు సహకార బ్యాంకుల్లో ప్రారంభించే విషయంపై ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ఉన్నతాధికారులతో మాట్లాడారు. తొలుత ఈ సేవలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు.
Also Read: యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్డ్రా.. ఇంత నగదు మాత్రమే తీసుకోగలరట!
సహకార సంఘాలు, బ్యాంకులు లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నేతలు చెబుతున్నారు. ముందుగా ఖాతాల డేటాను కంప్యూటీకరించారని, అందుకే ఆన్లైన్ సేవలు అమలు చేయటానికి మార్గం ఏర్పడిదంటున్నారు. సహకార బ్యాంకుల అకౌంట్ల నుంచి మొబైల్ ఫోన్ల ద్వారా యూపీఐ తో డబ్బులు పంపించవచ్చని అధికారులు తెలిపారు. డిజిటల్ సేవలను ఎప్పుడు, ఎక్కడి నుంచైనా వినియోగించుకోవచ్చని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లో త్వరలోనే యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిస్తోంది.