Bhatti Vikramarka: రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. మధిరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రసంగం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులందరూ ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేసి, ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించిందని, ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం అనేక వినూత్న ప్రణాళికలను అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు మెప్మా (MEPMA) ద్వారా మున్సిపాలిటీల్లో 6,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం క్యూర్ (Cure), ప్యూర్ (Pure), రేర్ (Rare) పాలసీని రూపొందించిందని, దీని ద్వారా హైదరాబాద్ వెలుపల ఉన్న మున్సిపాలిటీలను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా ‘రేర్’ (Rural Agri Regional Economy) విధానం ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను నెలకొల్పి, గ్రామీణ ఉత్పత్తులకు విలువను పెంచుతూ స్థానికంగా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
సంక్షేమ రంగంలో తమ ప్రభుత్వం సృష్టించిన రికార్డులను భట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తుచేశారు. గతంలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన వారందరికీ కొత్త కార్డులు పంపిణీ చేశామని, ప్రస్తుతం రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాల్లో 1.03 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. అల్ప ఆదాయ వర్గాలకు చేయూతనిచ్చేందుకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని, వినియోగదారుల తరఫున ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు బిల్లులు చెల్లిస్తోందని తెలిపారు. అలాగే, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. యువత భవిష్యత్తు కోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు (ITIs), పేద విద్యార్థుల కోసం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Read Also: Aadhaar News: ఆధార్ కీలక అప్డేట్.. ఫోన్ లింక్, ఇకపై కార్డు అవసరం లేదు