Traffic Inspector Transferred: హైదరాబాద్లో అవినీతిపై కఠిన చర్యలకు సీపీ సజ్జనార్ మరోసారి శ్రీకారం చుట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగరావును తక్షణమే బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు సబ్ఇన్స్పెక్టర్ అశోక్, హోంగార్డ్ కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్లను కూడా విధుల నుంచి తప్పిస్తూ బదిలీ వేటు పడింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో విధించిన చలాన్లను క్లియర్ చేయడానికి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు వీరిపై రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, చట్ట అమలు విషయంలో పారదర్శకతకు భంగం కలిగించే వారిపై ఎలాంటి సానుభూతి ఉండదని సీపీ సజ్జనార్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారానికి సంబంధించిన ఓ సంఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో విషయం బయటకు వచ్చింది. ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. మద్యం సేవించినట్టు నిర్ధారించిన ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తున్నట్లు చెప్పి, రెండు రోజుల తర్వాత స్టేషన్కు వచ్చి ఎస్సైని కలవాలని సూచించారు.
రెండు రోజుల తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆ వ్యక్తికి కేసు నమోదు చేయలేదని, కొంత నగదు ఇస్తే విషయం సర్దుబాటు చేస్తామని పోలీసులు సూచించారు. చివరకు రూ.10 వేల నగదు తీసుకోవడమే కాకుండా.. నలుగురికి బిర్యానీ తెప్పించాలంటూ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం అందుకున్న అనంతరం ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాహనాన్ని తిరిగి అప్పగించినట్లు సమాచారం.
డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కీలక కేసుల్లో చట్టాన్ని అతిక్రమిస్తూ లంచాలు తీసుకోవడం వల్ల ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పోలీసు శాఖ అభిప్రాయపడుతోంది. ఇలాంటి చర్యలతో శాఖ ప్రతిష్ఠ దెబ్బతినకుండా కఠిన నిర్ణయాలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇటీవలే ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకుని బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇకపై అవినీతి, అక్రమాలకు పాల్పడే ఎవరికైనా చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించడంతో పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేగుతోంది.