CM Chandrababu with Rajiv Singh: మూడు దశాబ్దాల కిందట ఉమ్మడి ఏపీలో చేసిన పొరపాటును ఇప్పుడు పునరావృతం చేయమని అన్నారు డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు ముందు ఆయన చెప్పడం విశేషం. అసలు ఏం జరిగింది?
సీఎం చంద్రబాబుతో డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్సింగ్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రముఖ నిర్మాణ సంస్థ డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్సింగ్ ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో వేగంగా మారుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తెచ్చారు. ఇరువుకు కలిసి రియల్ ఎస్టేట్ ముఖచిత్రంపై చర్చించారు. ఈ సందర్భంగా రాజీవ్సింగ్ను కలవడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు.
ముప్పై ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ విషయంలో చేసిన పొరపాటును ఇప్పుడు ఏపీలో పునరావృతం కానివ్వమని రియల్ ఎస్టేట్ సంస్థ, డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని రైసినా డైలాగ్-2026 వేదిక వద్ద జరిగిన ఈ సమావేశంలో ఆనాటి స్మృతులను రాజీవ్ సింగ్ గుర్తు చేసుకున్నారు.
దాదాపు మూడు దశాబ్దాల కిందట ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో భూములపై పెట్టుబడులు పెట్టాలని తనకు స్వయంగా సూచించారని రాజీవ్ సింగ్ గుర్తు చేశారు. చంద్రబాబు దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను సరిగ్గా అంచనా వేయలేకపోయానని మనసులోని మాట బయటపెట్టారు.
ఆనాడు చేసిన తప్పులు పునరావృతం కావన్న డీఎల్ఎఫ్
ఆనాడు సీఎం సలహా పాటించినట్లయితే ఎంతో లాభపడే వాళ్ళమని అన్నారు. ఓ గొప్ప పెట్టుబడి అవకాశాన్ని చేజార్చుకున్నామని బయటపెట్టారు. చంద్రబాబు విజన్ వల్ల రాయదుర్గం ఏరియా దేశంలో ప్రముఖ ఐటీ, వాణిజ్య కేంద్రంగా మారిందన్నారు.
ఏపీలో నూతన రాజధాని అమరావతి, విశాఖపట్నం సిటీలను ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు ఆ సంస్థ ఛైర్మన్కు వివరించారు. పెట్టుబడులకు అనుకూలమైన పాలసీలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా వివరించారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న డీఎల్ఎఫ్, ఈసారి ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రణాళికలో భాగస్వాములు కావాలని డీఎల్ఎఫ్ సంస్థను కోరారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆ సంస్థను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
ALSO READ: ఏపీలో మొదలైన రాజ్యసభ రేస్.. పెద్దల సభకు ఓ యువనేత..?
దేశంలో అత్యున్నత రియల్ ఎస్టేట్ డీఎల్ఎఫ్ను ఏపీకి స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ల్యాండ్మార్క్ డెవలప్మెంట్స్ను సృష్టించేందుకు అవకాశాలను పరిశీలించాలన్నారు. తద్వారా ఏపీ ప్రగతిలో భాగం కావాలని ఆకాంక్షించారు. ఏపీలో కొత్తగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు డీఎల్ఎఫ్ ఆసక్తిగా ఉందని ముఖ్యమంత్రికి ఆ సంస్థ ఛైర్మన్ తెలిపారు.
త్వరలో అమరావతిని సందర్శిస్తామని తెలిపారు. అక్కడున్న అవకాశాలను పరిశీలిస్తామని వెల్లడించారు. డీఎల్ఎఫ్ వంటి సంస్థలు ఏపీకి రావడం శుభ పరిణామమని, అమరావతిలో కాకుండా విశాఖపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాజీవ్ సింగ్ను ఈ సందర్భంగా సీఎం కోరారు.