Drunk Teacher: సమాజంలో పిల్లలకు మంచి మార్గం చూపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. ‘గురువు’ అంటే కేవలం చదువు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శి. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి, బాధ్యతగా నడుచుకోవాల్సిన ఒక టీచర్ మద్యం మత్తులో పాఠశాలకు రావడం తీవ్ర కలకలం రేపింది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పాఠాలు చెప్పాల్సిన స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు చేసిన పనికి తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పినపాడు గిరిజన పాఠశాలలో ఈ దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థుల పురోగతి, సమస్యల గురించి చర్చించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లల చదువుల గురించి మాట్లాడటానికి తల్లిదండ్రులంతా ఆశగా స్కూలుకు చేరుకున్నారు. అయితే, అక్కడికి వచ్చిన టీచర్ రమణ తీరు చూసి వారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు.
స్పృహతప్పి పడిపోయిన టీచర్
ఉపాధ్యాయుడు రమణ విధులకు పూర్తిస్థాయిలో మద్యం తాగి వచ్చాడు. కనీసం నిలబడే పరిస్థితి కూడా లేకపోవడంతో, తల్లిదండ్రులు చూస్తుండగానే మత్తులో తరగతి గదిలోని బెంచీపైనే పడిపోయాడు. ఎంత పిలిచినా లేవలేని స్థితిలో ఉన్న సదరు ఉపాధ్యాయుడిని చూసి పిటిఎమ్కు వచ్చిన తల్లిదండ్రులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన సమావేశంలోనే టీచర్ ఇలా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్.. అధికారుల విచారణ
పాఠశాలలో టీచర్ మద్యం మత్తులో బెంచీపై పడి ఉన్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. “ఇలాంటి టీచర్లు ఉంటే గిరిజన ప్రాంత పిల్లల భవిష్యత్తు, చదువు ఏం కావాలి?” అంటూ నెటిజన్లు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు సదరు ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతో తెలుసా?