ED Remand Report: ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో తీగ లాగితే డొంక కదిలిందా? మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లేనా? ఈడీ అడుగులు ఎటు వైపు? ఈ కేసులో నెక్ట్స్ వికెట్ ఎవరు? అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈడీ తన రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెల్లడించడమే ఇందుకు కారణం.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆనాడు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు- ఆయన కొడుకు సునీల్కుమార్లు ప్రధాన లబ్ధిదారులని తేల్చేసింది. ఆదివారం సాయంత్రం కారుమూరి నాగేశ్వరరావుని అరెస్టు చేసిన ఈడీ, సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచింది. అదే సమయంలో రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
రాజకీయ పలుకుబడితో కుంభకోణంలో భాగస్వాములైన వారితో సన్నిహిత సంబంధాలను పెట్టుకుని సబ్ కాంట్రాక్టుల కేటాయింపును తమ గుప్పిట్లో పెట్టుకున్నారని తేల్చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ.11.95 కోట్లు సునీల్, ఆయన భార్య కీర్తి, మామ ప్రతాప్రెడ్డి, తల్లి లక్ష్మీకిరణ్, సోదరి దీపిక, ఆమె మామ అచ్చప్పల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించినట్లు ప్రస్తావించింది. వచ్చిన డబ్బులు కారుమూరి కుటుంబానికి చెందిన అప్పులు తీర్చడానికి ఉపయోగించినట్టు పేర్కొంది.
అంతేకాదు స్థిరాస్తుల కొనుగోలుకు, ఆస్తుల సమీకరణ కోసం అడ్వాన్సుల చెల్లింపునకు, మైనింగ్ లీజుల హక్కులు పొందేందుకు వెచ్చించినట్లు తెలిపింది. దీనికితోడు లగ్జరీ వాహనాలు, ఖరీదైన వాచీలు కొనుగోళ్లు, భర్త్ డే పార్టీ వేడుకలు, విమాన ప్రయాణాల ఖర్చులు, పార్టీ ఫండింగ్కు వాడినట్లు తెలియజేసింది. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు వ్యవహారాలను కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు చూసేవారని తెలిపింది.
విచారణకు రావాలంటూ కారుమూరి నాగేశ్వరరావుకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా, ఆయన పట్టించుకోలేదని ఈడీ ప్రస్తావించింది. జూన్ 24 నుంచి ఆగస్టు 17 వరకు 10 సార్లు నోటీసు ఇచ్చినట్టు తెలిపింది. కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించాలనే దురుద్దేశంతో విచారణకు గైర్హాజరయ్యారని, తెలిసిన వాస్తవాలను దాచి పెట్టేందుకు ప్రయత్నించారని తెలియజేసింది. కారుమూరి మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేందుకు ఆధారాలు ఉండడంతో అరెస్టు చేసినట్టు ప్రస్తావించింది. కొల్లగొట్టిన సొత్తును తన కుటుంబ సభ్యులకు మళ్లించడంలో నాగేశ్వరరావు మధ్యవర్తిగా వ్యవహరించారని తేల్చి చెప్పేసింది.
ALSO READ: ‘యువతులను ట్రాప్ చేస్తున్నారు’.. ఏపీ ప్రభుత్వానికి రాజాసింగ్ కీలక హెచ్చరిక
ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు కీలకమైన వ్యక్తి కావడంతో ఆయన్ని విచారణకు తీసుకోవాలని ఆలోచన చేస్తోంది ఈడీ. ఆయన్ని విచారిస్తే.. ఈ కుంబకోణం వెనుక పాత్ర-సూత్రదారులు ఎవరన్నది తేలనుంది. అదే జరిగితే నెక్ట్స్ వికెట్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా నేతలు చర్చించుకుంటున్నారు.