Kakinada: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. ఆయన్ని కలియుగం శకునిగా భావిస్తుంటాయి రాజకీయ పార్టీలు. ఆ తరహాలో ఆయన రాజకీయ ఎత్తులు వేస్తుంటారు. గతంలో ఆయన అలాంటివి చేయడంతో ఆయన మాటలను చాలామంది పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ట్రెండ్ను తనకు అనుకూలంగా మలుచుకుని రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య వ్యవహారం తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య ఇష్యూను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కొన్నాళ్లుగా ఈ ఇష్యూపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సోమవారం కోనసీమ జిల్లా రావులపాలెం వెళ్లిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. నూకరాజు అల్లుడు జగదీశ్రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.
నూకరాజు మనవడు రియాన్స్ కార్తికేయను పరామర్శించారు. నూకరాజు ఫ్యామిలీ, జగదీశ్రెడ్డి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. సాదిక్ ఖాన్ వేధింపులతో ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. సాదిక్ కరుడుగట్టిన నేరస్తుడని, ఆయనతోపాటు మరో 9 మంది టెర్రరిస్టు ముఠా ఉందన్నారు.
ఆ టెర్రరిస్టు ముఠాలు కాకినాడ-రాజమండ్రిలో 15 కుటుంబాటలను వేధించాయంటూ ఆరోపణలు గుప్పించారు. మత మార్పిడి కోసం మహిళలను వేధించి, వారి ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు. హిందూ కుటుంబాలను ఇస్లాంలోకి మార్పించడమే ఈ ముఠా లక్ష్యమన్నారు.
అంతేకాదు ఏఈ నూకరాజు ఆస్తులను సాదిక్ బలవంతంగా రాయించుకున్నారని, రావులపాలెంలో 40 సెంట్ల భూమిని రాయించున్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం భూమి మాత్రమే కాదు రూ. 2 కోట్ల విలువ చేసే బంగారం, నగదు లాక్కున్నాడని విమర్శించారు. నూకరాజు కూతురు సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డికి సాదిక్ విషం పెట్టి చంపాడని కొత్త విషయాలు బయటపెట్టారు. ఆయన బీమా డబ్బు కూడా సాదిక్ కాజేశాడని దుయ్యబట్టారు.
గతంలో ఎప్పుడూ లేని లవ్ జీహాద్ ఏపీకి ఎలా వచ్చిందంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాం నుంచి రాష్ట్రంలో లవ్ జీహాద్ జరుగుతోందని, సౌజన్య మరణ వాంగ్మూలంలో చాలా దారుణాలు బయటపడ్డాయని అన్నారు.జగన్ అధికారంలో ఉండగా మతమార్పిడిలను ప్రొత్సహించారని, కొత్తపార్టీపై త్వరలో మాట్లాడతానని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
మరోవైపు ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు సాదిక్ ఖాన్. ఈనెల 16న రాత్రి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు నూకరాజు. ఈ ఘటనలో నూకరాజు, అతని భార్య మీనా, కూతురు సౌజన్య మృతి చెందారు. నూకరాజు మనవడు రియాన్స్ కార్తికేయ బయటపడ్డాడు. తాము ఆత్మహత్యకు సాదిక్ అనే వ్యక్తి కారణమని లేఖ రాశారు నూకరాజు. కాకినాడలో ప్రొ రైఫిల్ షూటింగ్ అకాడమీ నడుపుతున్నాడు సాదిక్.
నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు సాదిక్ ఖాన్. ఐదురోజులపాటు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. యూపీలోని మేరఠ్లో సాధిక్ను అరెస్టు చేశారు కాకినాడ పోలీసులు. ఈనెల 22న మేరఠ్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై కాకినాడకు తరలించారు. రైలులో కాకినాడకు సాదిక్ ను తీసుకొచ్చారు పోలీసులు.
ALSO READ: ఏపీలో లిక్కర్ కేసు కొత్త మలుపు.. మాజీ మంత్రి కారుమూరు అరెస్ట్
అర్ధరాత్రి సామర్లకోట సమీపంలోని మేడపాడు స్టేషన్ కు తీసుకొచ్చారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ సర్పవరం పీఎస్కు పోలీసు వాహనంలో తరలించారు. సోమవారం ఉదయం నుంచి సాదిక్ ను విచారిస్తున్నారు పోలీసులు. ఆయనను ఏఎస్పీతోపాటు ఆరుగురు సీఐల టీమ్ విచారణ చేస్తోంది. విచారణ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు.
ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా పని చేసిన విజయసాయిరెడ్డి, కరుడు గట్టిన హిందుత్వవాదిగా మాట్లాడడంపై ఆశ్చర్యపోతున్నారు రాజకీయ నేతలు. ఏపీలో పెద్దగా లేని లవ్ జీహాద్ అంటూ కొత్త రాజకీయాలు ప్రారంభించారని, ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో వీఎస్ఆర్ ఉన్నారని గుర్తు చేశారు. సాదిక్ను విచారిస్తున్న పోలీసులు, ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.