Anitha Drone Accident: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. తిరుపతిలో జరిగిన డ్రోన్ ప్రమాదంలో ఆమె చేతికి స్వల్ప గాయం అయ్యింది. అమరావతి చాంపియన్ షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్వాహకులు డ్రోన్ ను గాల్లోకి ఎగురవేయగా.. దానిలో బ్యాటరీ డౌన్ అయ్యి అది ఒక్కసారిగా హోంమంత్రి చేతిపై పడింది. దీంతో ఆమెకు స్వల్ప గాయమైంది. దెబ్బ చిన్నది కావడంతో చేతికి బ్యాండేజీతోనే ఆమె కార్యక్రమంలో కొనసాగారు.
మరోవైపు డ్రోన్ ప్రమాదంతో తిరుపతి పోలీసులు అప్రమత్తయ్యారు. ప్రమాదానికి కారణమైన డ్రోన్ ను వెంటనే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు కారణం సాంకేతిక లోపమా? నిర్వాహకుల నిర్లక్ష్యమా? అనే యాంగిల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వీఐపీలు పాల్గొనే సభలో డ్రోన్ ల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గాయమైన చేతితో అనిత సభలో ప్రసంగించడం గమనార్హం.
మరోవైపు తిరుపతి పర్యటనలో భాగంగా అక్కడి ఎస్పీ కార్యాలయంలో కొత్తగా నిర్మించిన జిల్లా మహిళా పోలీసు స్టేషన్ ను హోమంత్రి అనిత ప్రారంభించారు. రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్ లో అత్యాధునిక సౌకర్యాలను కల్పించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇందులో ఫ్యామిలీ కౌన్సిలింగ్, మహిళలతో ప్రత్యేకంగా మాట్లేడేందుకు ఛాంబర్లను సైతం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చిన్నారులతో వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా బేబీ కేర్ సెంటర్, మిల్క్ ఫీడింగ్ రూమ్స్, కుటుంబ సభ్యులు వేచి ఉండేందుకు ప్రత్యేక గదులు ఈ స్టేషన్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
Also Read: ఫార్చ్యూనర్ కారులో వచ్చి.. రోడ్లు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికుడు.. అస్సలు తగ్గేదేలే!
అంతకుముందు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె ఆలయం వెలుపలకు రాగా.. హోంమంత్రిని చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. పలువురు అనితకు కరచాలనం సైతం ఇచ్చారు.
Also Read: విజయసాయిరెడ్డి కొత్త రాజకీయాలకు పదును.. వైసీపీని టచ్ చేస్తూ, లవ్ జీహాద్ అంటూ..