Kadapa Mayor: కడప నగర నూతన మేయర్ ఎన్నిక ప్రక్రియ మరోసారి వివాదాస్పదంగా మారింది. మేయర్ ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 11 న కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. ఈ నోటిఫికేషన్ చెల్లదంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. అవినీతి ఆరోపణల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించింది. ఆ సమయంలో డిప్యూటి మేయర్ తాత్కాలిక మేయర్ గా వ్యవహరిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఎన్నికల కమిషన్ తాజాగా కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది.
పదవి నుంచి తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ సురేష్ బాబు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. కొత్త మేయర్ ఎంపికకు నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదంటూ సురేష్ బాబు మరోసారి కోర్టుకు వెళ్లారు. ఇప్పటికే పదవి తొలగింపుపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నందున.. కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియ చెల్లదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు చేపట్టనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కడప మేయర్ ఎన్నిక అంశం రాష్ట్ర రాజకీయాల్లో, న్యాయస్థానాల్లో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Hyderabad News: కోర్టుకి చేరిన హిల్ట్ పాలసీ వ్యవహారం.. పిటిషన్ వేసిన కేఏ పాల్, విచారణ ఎప్పుడంటే