ఏలూరు జిల్లాలో పెద్దపులి మళ్ళీ పంజా విసిరింది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో వరుస దాడులకు తెగబడుతూ పశువులను పొట్టనబెట్టుకుంటోంది. కొయ్యలగూడెం, బుట్టాయగూడెం మండలాల్లోని గ్రామాల ప్రజలు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పులి సంచారం స్పష్టంగా కనిపిస్తున్నా, అటవీ శాఖ అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరుస దాడులు – వణుకుతున్న గ్రామాలు..
కొయ్యలగూడెం మండలం మంగదేవిపేట గ్రామంలో ఒక లేగదూడపై దాడి చేసిన పులి, దానిని చంపి తినేసింది. అలాగే, బుట్టాయగూడెం మండలం కోట రామచంద్రపురం పంచాయతీ పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో ఒక గేదెను వేటాడింది. అంతటితో ఆగకుండా, కొయ్యలగూడెం మండలం బిల్లిమిల్లి నుంచి కామయ్యకుంట వెళ్లే దారిలో మరో గేదె దూడను చంపేసింది. ఈ వరుస ఘటనలతో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లాలన్నా, పశువులను మేతకు తీసుకెళ్లాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అటవీ శాఖ నిర్లక్ష్యంపై విమర్శలు..
పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతాల్లో కనీస సమాచారం అందించడంలో అటవీ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. పులి ఎక్కడ ఉంది? ఏ దిశగా వెళ్తోంది? అనే విషయాలపై ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు వెనకబడి ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో గస్తీ పెంచాల్సింది పోయి, కేవలం “నష్టపరిహారం వస్తుందిలే” అని బదులివ్వడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటవీ శాఖపై ప్రజల ఆగ్రహం..
‘పశువుల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా? రేపు మనుషులపై దాడి చేసే వరకు వేచి చూస్తారా?’ అంటూ కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. కేవలం నష్టపరిహారం ఇస్తామని చెప్పడం వల్ల పోయిన పశువులు తిరిగి రావని, అసలు పులిని పట్టుకోవడానికి లేదా జనావాసాల్లోకి రాకుండా చూడటానికి గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అటవీ శాఖ స్పందించి, పులిని బంధించాలని లేదా సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: Onion Juice for Hair Regrowth: బట్టతలపై జుట్టు మొలిపించే ఉల్లిపాయ రసం.. ఇంతకీ సైన్స్ ఏం చెబుతోందంటే?