Amaravati News: చేసిన తప్పు అనునిత్యం వెంటాడుతుంది. అది ఎవరైనా కావచ్చు.. ఆ విషయాన్ని బయటపెడితే కొంతలో కొంతైనా దిగులు తగ్గుతుంది. ఏపీ మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అదే చేశారు. వైసీపీ హయాంలో తాను చేసిన తప్పులను బయటపెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులకు పబ్లిక్ గా ఆయన క్షమాపలు చెప్పారు.
ఏపీ రాజకీయాల్లో మాజీ ఐఏఎస్ అధికారి వీడియో దుమారం
వైసీపీ హయాంలో ఇష్టానుసారం చెలరేగిపోయారు మాజీ ఐఏఎస్ ప్రవీణ్ప్రకాష్. ఆనాటి సీఎం జగన్ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునేది ఆయనే. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్లను వేధించినట్టు ఆయనపై ఆరోపణలు కోకొల్లలు. చేసిన తప్పులు ఆయన్ని అనుక్షణం వెంటాడుతున్నాయి. చివరకు తట్టుకోలేక గుట్టంతా బయటపెట్టారు. ఇన్స్టా ద్వారా ఇద్దరు అధికారులకు ఆయన పబ్లిక్గా క్షమాపణలు చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగిన వారిలో ఇద్దరు అధికారులు ఉన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మరొకరు జాస్తి కృష్ణకిశోర్. వారిద్దరికీ ప్రవీణ్ ప్రకాశ్ బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆనాడు తను వ్యవహరించిన తీరు వల్ల అధికారులు అంతులేని మానసిక వేదనకు గురయ్యారని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
తాను తప్పు చేశానంటూ ప్రవీణ్ ప్రకాష్ ప్రశ్చాత్తాపం
ఆ అధికారులతోపాటు వారి కుటుంబసభ్యులకు వ్యక్తిగతంగా నష్టం జరిగిందని తెలిపారు. తాను చేసిన పనికి బహిరంగ క్షమాపణ చెప్పడం వల్ల అంతరాత్మను శుద్ధి అవుతున్నట్లు తెలిపారు. అందులో తన స్వార్థం కూడా ఉందని వాపోయారు. ఏపీతో తనకుమూడు దశాబ్దాల అనుభవం ఉందన్నారు ప్రవీణ్ ప్రకాష్.
వివిధ హోదాల్లో రాష్ట్రంలో పని చేశానని, ఆయా ప్రాంత ప్రజలు తనపై అంతులేని ప్రేమ చూపించారని మనసులోని బాధ బయటపెట్టారు. గతేదాడి జూన్-జులైల్లో తనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారని, అప్పటివరకు తల ఎత్తుకుని హీరోగా ఉన్న తాను, ఒక్కసారిగా విలన్ అయిపోయానని చెప్పారు.
ఈ నేపథ్యంలో గతేడాది జులైలో వీఆర్ఎస్ తీసుకున్నానని వెల్లడించారు. తాను చేసిన తప్పుకు ఏడాదిగా ఆత్మశోధన చేసుకున్ననని వెల్లడించారు. వివిధ ప్రాంతాల ప్రజల అంచనాలను అందుకోలేకపోయానని, అందులో విఫలమైనట్టు గుర్తించానని పేర్కొన్నారు.
ALSO READ: లోకేష్ కొత్త రూల్స్తో వారికి పండగే
2020లో సాధారణ పరిపాలన శాఖలో ఉండగా అప్పటి ఏడీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాల నమోదు దస్త్రం డీజీపీ ఆఫీసు నుంచి వచ్చిందన్నారు. ఏబీ తనకంటే సీనియర్ అని, అలాంటి అధికారిపై చర్యలకు సంబంధించిన ఫైల్పై నిర్ణయం తీసుకోవాల్సిన విషయంలో కాస్త ఇబ్బంది పడ్డానని అన్నారు. సివిల్ సర్వీసెస్ నిబంధనల అనుసరించి ఆ ఫైల్కి ఆమోదం తెలపాల్సి వచ్చిందన్నారు.
ఇక మరో అధికారి కృష్ణకిశోర్ విషయంలో అదే జరిగిందన్నారు. సర్వీసు నిబంధనలు చాలా ఉంటాయని, ప్రతి ఒక్కటీ తప్పకుండా పాటించలేమన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు-కృష్ణ కిశోర్లపై చర్యలు తీసుకోవచ్చునని తాను ఫైల్లో రాయడం కూడా అలాంటిదేనని వెల్లడించారు. నిబంధనల కోణంలో చూసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చునని అందులో ప్రస్తావించినట్టు బయటపెట్టారు.
తాను వివిధ వివిధ హోదాల్లో పని చేసినప్పుడు దిగువ స్థాయి ఉద్యోగులు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే వారికీ క్షమాపణ చెబుతున్నానని తన ఆవేదనను బయటపెట్టారు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్. ఈ వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం మొదలైంది. అప్పట్లో ఓ వర్గానికి చెందిన అధికారులను జగన్ సర్కార్ ఏం చేసిందన్నది విడమరిచి చెప్పారు.