Nara Lokesh: తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ టిడిపిలో మాత్రం కార్యకర్తలే ఆ పార్టీకి పట్టుకొమ్మలు.. ఎన్టీ రామారావు దగ్గరనుంచి చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన్పపుడు ఆయన వైపే కార్యకర్తలు నిలిచారు. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలని అందరు ఓప్పుకునే విషయమే. అలాంటి పార్టీలో కార్యకర్తలు పరిస్థితి ఏమిటి అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆ క్రమంలో లోకేష్ నిర్ణయంతో క్యాడర్లో జోష్ కనిపిస్తోందంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుంది.. వైసీపీ హయాంలో పార్టీ కోసం ప్రాణాలర్పించి, ఆస్తులు కోల్పోయి, ఉర్లు వదిలిపెట్టి వెళ్లిపోయిన వారు, జైలుకు వెళ్లిన వారు, వేల సంఖ్యలో ఉన్నారు. పార్టీ అధికారంలోకైతే వచ్చింది కానీ… వారి సమస్యలు వారి ఇబ్బందులు పరిష్కారం కాలేదు కదా.. ఇంకా పెరిగాయని… అసలు అధికారంలో ఉన్నది టిడిపి నా కాదా అనే సందేహం కొంతమంది కార్యకర్తల్లో నేటికీ కలుగుతుందట. గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు టిడిపిలోకి వచ్చి నియోజకవర్గాల్లో వైసిపి నేతలు పెత్తనం చెలాయిస్తున్నారట. దీంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారట. చాలా రోజుల తర్వాత కార్యకర్తల అసంతృప్తి ఆగ్రహాన్ని అధిష్టానం గుర్తించిందట.
గత ఐదు సంవత్సరాలు కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన ఇబ్బందులు, కష్టాలు ఎవరు పడి ఉండరు. జెండా పట్టుకోవాలంటే భయం… టిడిపి అని చెప్పుకోవాలంటే ఆందోళన. అయినప్పటికీ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పని చేసి కూటమిని అఖండ మెజార్టీతో అధికారంలో తీసుకువచ్చారు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంగీకరిస్తూ, తెలుగుతమ్ముళ్లను ప్రశంసించారు.
కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సమస్యలు పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి తమ్ముళ్లలో ఉంది. దాని కారణం ఎమ్మెల్యేలకు కార్యకర్తల మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ నడుస్తుందట. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన చంద్రయ్య కుమారుడికి సైతం నేటికి ఉద్యోగం రాని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు… కాంట్రాక్టర్లు పనులు వారికే ఇవ్వటం… నిజమైన కార్యకర్తలు పట్టించుకోకపోవడం టిడిపికి పెద్ద ఇబ్బందికరంగా మారిందనేది ఇంటర్నల్ టాక్. దీంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో సోషల్ మీడియా వేదికగా అధిష్టానం పై ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారట.
మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లాలో జరిగిన హత్య విషయంలో కూడా ఒక సామాజిక వర్గానికి ప్రభుత్వం భారీ ఎత్తున వరాలు ప్రకటించింది. దాంతో బిజెపి, జనసేనకి అనుబంధంగా ఉంటే మాత్రం కార్యకర్తల విషయంలో స్పందిస్తారా… నిజమైన పార్టీ కార్యకర్తల విషయంలో మాత్రం పట్టినట్లు వ్యవహరిస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తెలుగు తుమ్ముళ్లు. గతంలో టీడీపీ నేతలను ఇబ్బందుల పాలు చేసిన వైసీపీ నేతల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించడం పట్ల కార్యకర్తలు అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట.
ఆ క్రమంలో టీడీపీ బ్యాక్ ఆఫీస్ టీం .. పార్టీ కార్యకర్తలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అనేదానికి సంబంధించి 20 పేజీల నివేదికను పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు అధిష్టానం సిద్ధమవుతోందట. దీంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ స్థాయిలో ఎప్పుడు నామినేట్ పోస్టులు భర్తీ చేయలేదు.. అయినా కార్యకర్తలు ఎందుకు అసంతృప్తి ఉంది.. కారణాలేంటి పసిగట్టండని నేతలకు దిశానిర్దేశం చేశారట.
ఎమ్మెల్యేలు ,ఎంపీలు పార్టీ పెద్దలు నిరంతరం కార్యకర్తలతో సమావేశం అవ్వాలని లోకేష్ ఆదేశించారంట. కార్యకర్తే అధినేత, పార్టీలో ప్రతీ ఒక్క కార్యకర్తకూ న్యాయం జరగాలనే సంకేతాన్ని నేతలకు పంపారట లోకేష్. లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో కార్యకర్తలకి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారట తెలుగు తుమ్ముళ్లు.
Story by Apparao, Big Tv