Family Died due to Debts (Andhra news today) : రైతన్నలు, చేనేత కార్మికులు ఎంత కష్టపడినా వారి సంపాదన అంతంత మాత్రమే. చేసిన పనికి తగిన జీతం, ప్రతిఫలం వస్తే చాలు.. వారి ఆనందానికి అవధులుండవ్. అలాంటి చేనేత కార్మికుల రక్తం పిండుకుంటున్నారు అధికారులు. తమకు చెందిన భూమిని మరొకరిదంటూ రికార్డులు మార్చడంతో, చేసిన అప్పులు తీర్చలేక ఓ చేనేత కార్మికుడి కుటుంబం కన్నుమూసింది. వైఎస్సార్ జిల్లా రాజంపేటకు సమీపంలో ఉండే ఒంటిమిట్టలో జరిగిందీ విషాద ఘటన. భార్య, కూతురిని చంపి.. ఆ ఇంటి యజమాని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బారావు(47) చేనేత కార్మికుడు. ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో భార్య పద్మావతి(41), కూతురు వినయ (17)తో కలిసి నివాసం ఉంటున్నాడు. చేసే పనికి తగిన సంపాదన లేక, కుటుంబ పోషణ గడవక అప్పుల పాలయ్యారు. తమకు ఉన్న భూమిని అమ్మి అప్పు తీరుద్దామంటే.. తమకు చెందిన 3.10 ఎకరాల భూమిని మరొక వ్యక్తి పేరిట ఉన్నట్లుగా స్థానిక ఎమ్మార్వో రికార్డులను తారుమారు చేశాడు. ఈ క్రమంలోనే సుబ్బారావు తన భార్య, కూతురిని చంపి.. ఒంటిమిట్ట రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో తమ చావులకు కారణం ఎమ్మార్వో సుబ్బారావేనని పేర్కొన్నాడు. లంచం తీసుకుని తమ భూమిని వేరేవారి పేరుమీద రికార్డులు మార్చినందుకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.