వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని చిక్కుల్లో పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పేర్ని నాని.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో సంయమనం కోల్పోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల వ్యక్తిత్వాలను కించపరిచేలా మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై, చంద్రబాబు పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రసంగం ఉద్రిక్తతలకు దారితీసేలా ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి.
నమోదైన సెక్షన్ల వివరాలు..
పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ కార్యకర్తలు ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద పలు సెక్షన్లను నమోదు చేశారు. సెక్షన్ 196(1): వివిధ వర్గాల మధ్య విద్వేషాలను ప్రేరేపించడం, సెక్షన్ 353(2): తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడ, సెక్షన్ 351(2) & 352: క్రిమినల్ బెదిరింపులు, ఉద్దేశపూర్వకంగా అవమానించడం.. ఇలా పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.
ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు. గతంలో కూడా పేర్ని నాని ప్రత్యర్థి పార్టీల నేతలపై ఘాటు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈసారి ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలను లక్ష్యంగా చేసుకోవడంతో ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుంది.
ఈ కేసు నమోదుపై వైసీపీ శ్రేణులు స్పందిస్తూ, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొట్టిపారేస్తున్నాయి. ప్రతిపక్ష గొంతు నొక్కడానికే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు, ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలి కానీ, వ్యక్తిగత దూషణలు సహించబోమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం కృష్ణా, ఏలూరు జిల్లాల్లో రాజకీయ వేడిని పెంచింది.
ALSO READ: Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ కుటుంబంలో పంపకాల పంచాయతీ.. ఎంపీ చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు!