Srisailam VIP cottage: ఈ మధ్యకాలంలో ఏసీలు టపాసుల మాదిరిగా పేలుతున్నాయి. మెయింటెనెన్స్ లేకపోవడం, లేకుంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో బయటపడింది. అర్ధరాత్రి ఏసీ పేలడంతో ఒక్కసారి మంటలు వ్యాపించాయి. దీంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. అసలు అక్కడ ఏం జరిగింది?
శ్రీశైలం వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం
మహాశివరాత్రి తర్వాత శ్రీశైలంలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. జ్యోతి లింగం-శక్తి పీఠం ఒకే దగ్గర ఉండడంతో తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలానికి సమీపంలోని వారు ఉదయం వచ్చి స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం మళ్లీ బయలు దేరిపోతున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు నైట్ రెస్టు తీసుకుని, ఆ చుట్టు ప్రాంతాలను దర్శిస్తున్నారు. శ్రీశైలంలో కొలువు దీరిన శ్రీభ్రమరాంబ-మల్లికార్జునస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు పెను ప్రమాదం తప్పింది. స్థానికంగా ఉండే వీఐపీ కాటేజీలో ఆదివారం వేకువజామున ఏసీలో పేలింది. మంటలు చెలరేగడంతో భయంతో భక్తులు బయటకు పరుగులు తీశారు.
పేలిన ఏసీ.. పరుగులు తీసిన భక్తులు
భక్తులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వీఐపీ కాటేజీ వద్దకు చేరుకున్నారు. మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు వచ్చినట్టు చెబుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఉన్నట్లుండి ఏసీ పేలడంతో ఆలయ సిబ్బంది కాటేజీలపై ఫోకస్ చేశారు అధికారులు. కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలంలో ఏసీలు విపరీతంగా పేలుతున్నాయి. గతంలో ఎక్కడో ఒక చోటు ఈ తరహా ఘటనలు జరిగేవి. ఇప్పుడు వారంలో ఒకటి లేదా రెండు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. వేసవి రాకముందు ఇలా ఉంటే, ఎండాకాలం తీవ్రమైతే ఇంకెన్ని ఏసీలు బ్లాస్ట్ అవుతాయోనని చర్చించుకుంటున్నారు.
ALSO READ: కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి అంబటి ఫైర్.. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది మీరు కాదా..?
వీకెండ్ రావడంతో శని, ఆదివారాల్లో భక్తులు భారీగా శ్రీశైలానికి తరలి వచ్చారు. స్థానికంగా ఉండే రూమ్లు దాదాపుగా భక్తులతో నిండిపోయాయి. ఆలయంలోని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీశైలం ఘాట్ రోడ్ వద్ద ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు పోలీసులు.