Kamareddy: కామారెడ్డి పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య సాగుతున్న సవాళ్లు, ప్రతిసవాళ్లు చివరకు ఘర్షణలకు దారితీశాయి. నిన్న ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి నివాసం వద్ద చోటుచేసుకున్న కారు ధ్వంసం, దహనం ఘటనలతో పట్టణంలో హైటెన్షన్ కొనసాగుతోంది. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నేడు మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డికి చేరుకోనున్నారు. ఆయన నేరుగా ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లి, నిన్నటి దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఈ ఘటనలపై బీజేపీ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తూ ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
అరెస్టులు, రిమాండ్
నిన్నటి హింసాత్మక ఘటనలపై పోలీసులు సీరియస్ యాక్షన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద కారుతో వచ్చి గొడవకు దిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గీ రెడ్డి మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసుల గృహ నిర్బంధాలు
మరోవైపు, బీజేపీ రాష్ట్ర నాయకులు కామారెడ్డికి రాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు కీలక నాయకులను వారి నివాసాల్లోనే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతుండగా, ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రేపు కలెక్టరేట్ వద్ద సవాల్
సవాళ్ల పర్వం ఇంకా సద్దుమణగలేదు. రేపు (సోమవారం) కలెక్టరేట్ వేదికగా అధికారుల సమక్షంలోనే అన్ని విషయాలను తేల్చుకుందామని ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. అయితే, ఎమ్మెల్యే అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
Also Read: డైలమాలో గులాబీ క్యాడర్.. పార్టీలో కొనసాగాలా? వద్దా అన్నట్టు రహస్య చర్చలు
ముగియని వివాదం
ప్రస్తుతానికి కామారెడ్డిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లుగా పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేతల దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుండగా, వివాదానికి మూలం బీజేపీనే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పోలీసులు పట్టణమంతా నిఘా ఉంచారు. నేడు రామచంద్ర రావు పర్యటన తర్వాత ఈ ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కామారెడ్డిలో కొనసాగుతోన్న హైటెన్షన్
ఇంకా సద్దుమనగని కాంగ్రెస్-బీజేపీ సవాళ్ల వివాదం
సోమవారం కలెక్టరేట్లో అధికారుల సమక్షంలో తేల్చుకుందామని మరోసారి సవాల్ విసిరిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతల ఆగ్రహం
నిన్న ఎమ్మెల్యే వెంకటరమణ… pic.twitter.com/QNgfhX1PWZ
— BIG TV Breaking News (@bigtvtelugu) February 22, 2026