Kadapa News: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ విషాదం చోటు చేసుకుంది. వసంతపేట మున్సిపల్ పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పది మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటుండగా.. ఒక్కసారిగా కడుపునొప్పి వాంతులతో బాధపడటం మొదలు పెట్టారు. పరిస్థితిని గమనించిన పాఠశాల హెడ్మాస్టర్ వెంటనే స్పందించారు. అస్వస్థతకు గురైన పది మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ప్రాథమిక విచారణ జరిగింది. దీనికి కారణం మధ్యాహ్న భోజనంలో పెట్టిన కందిపప్పే అని తేలింది. నిల్వ ఉంచిన కందిపప్పుకు పురుగులు పట్టకుండా నివారించడానికి పప్పు బస్తాలలో కొన్ని గుళికలు వేశారు. భోజనం వండే క్రమంలో ఈ గుళికలతో పాటే కందిపప్పును ఉడకబెట్టారు. ఈ కారణంగా పప్పు పూర్తిగా కలుషితమైంది. కలుషితమైన పప్పు తిన్న విద్యార్థులు వెంటనే అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అజాగ్రత్తకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ALSO READ: Telangana Rising Global Summit: రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల