Telangana Rising Global Summit: రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగోను అధికారులు ఫైనల్ చేశారు. తుది లోగోను శుక్రవారం విడుదల చేశారు. ఈ లోగోలో తెలంగాణ మ్యాప్, గ్లోబ్ ప్రతీకలు ఉన్నాయి. అభివృద్ధిలో మొదటి స్థానానికి సూచనగా వన్ నెంబర్ ను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9న రెండు రోజుల పాటు రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను విడుదల చేశారు. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఈ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
‘తెలంగాణ రైజింగ్-2047’ విధానాన్ని బలోపేతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. తెలంగాణ అభివృద్ధి దార్శనికతను ప్రతిబింబించేలా పాలసీ ఉండాలని నొక్కి చెప్పారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే రోడ్మ్యాప్ను ఈ పాలసీ స్పష్టంగా వివరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు విభిన్న ప్రాంతాలుగా విభజించాలని ముఖ్యమంత్రి సూచించారు.
1.కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)
2.పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)
3.గ్రామీణ వ్యవసాయ ప్రాంత ఆర్థిక వ్యవస్థ (RARE)
ఈ ప్రాంతాలలో ప్రతి ఒక్కటి ఏ రకమైన అభివృద్ధిని చేపట్టాలో నివేదికలో పేర్కొనాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆరోగ్యం, విద్య, సాంకేతికత, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, ఫార్మా, వ్యవసాయం వంటి రంగాల వారీగా అభివృద్ధికి వివరణాత్మక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రోడ్లు, ఓడరేవులు, కనెక్టివిటీతో సహా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రాముఖ్యతను సీఎం స్పష్టం చేశారు. కొత్తగా ప్రతిపాదించబడిన విమానాశ్రయాలు ప్రయాణీకులు, కార్గో సేవలకు మద్దతు ఇచ్చేలా ప్రణాళిక వేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్లో పలు దేశాలకు చెందిన అంబాసిడర్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.
తొలిరోజు: సమ్మిట్ మొదటి రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి వివరించనున్నారు.
రెండో రోజు: తెలంగాణ భవిష్యత్తు దార్శనికత, ప్రణాళికలు కలిగిన తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వ విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలను వివరించే ఆడియో, వీడియో ప్రజెంటేషన్లు ఇవ్వనున్నాయి.
Also Read: Hyderabad News: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. స్టే విధించలేమన్న హైకోర్టు
గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యే అతిథులకు వసతి సదుపాయాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ, ఉన్నతాధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.