Perni Nani Mangalagiri Hospital Issue: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రి వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఇక్కడికి వచ్చారు. అయితే బాధితులు ఉన్న ఐసీయూ (ICU) లోపలికి వెళ్లే క్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఆయనను అడ్డుకోవడంతో పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాదాపు పది నిమిషాల పాటు సిబ్బందితో ఆయన వాగ్వాదానికి దిగారు.
ఐసీయూ డోర్ వద్ద డ్యూటీలో ఉన్న సిబ్బంది నిబంధనల ప్రకారం ఆయనను లోపలికి అనుమతించలేదు. దీనిపై పేర్ని నాని మండిపడుతూ “మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు దగ్గరుండి లోపలికి తీసుకెళ్లి ఫొటోలు దిగడానికి అనుమతిస్తారు కదా.. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. ఆసుపత్రి యాజమాన్యం రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందని కావాలనే తనను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. “మేము ఎవరైతే మీకెందుకు? ఆసుపత్రిలో కూడా రాజకీయాలు చేస్తారా?” అంటూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు.
పేర్ని నాని గట్టిగా నిలదీయడంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున ఐసీయూ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వారికి వివరించి సర్దిచెప్పారు. అధికారుల వివరణతో శాంతించిన పేర్ని నాని అక్కడి నుండి వెనుదిరిగారు. ఈ ఘటన మంగళగిరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.