పింకీ..పాంకీ..డాంకీ
⦿ గాడిదల పేరుతో ఫ్రాంచైజీ
⦿ జనాన్ని దారుణంగా నమ్మించిన ఉలగనాథన్
⦿ మంత్రి లోకేష్ ని కలిసిన ఏపీ బాధితులు
⦿ చర్యలు తీసుకోవాలని వినతి
⦿ రెండు తెలుగు రాష్ట్రాలలో బాధితులు
⦿ తమిళనాడు, కర్ణాటకలోనూ మోసాలు
⦿ యూట్యూబ్ ఛానల్ తో విస్తృత ప్రచారం
⦿ గాడిదలతో వ్యాపారం లక్షల్లో లాభం
అంటూ ప్రచారం
⦿ నమ్మి లక్షల్లో పెట్టుబడులు పెట్టిన పబ్లిక్
⦿ వంద కోట్లకు పైగా వసూల్లు
⦿ రంగంలోకి దిగిన పోలీసులు
⦿ బిచాణా ఎత్తేసి పారిపోయిన ఉలగనాథన్
చెన్నై, స్వేచ్ఛ: Donkey Milk Scam: నమ్మేవాళ్లు ఉన్పప్పుడు నమ్మించేవాళ్లు కూడా ఉంటారు. తమ తెలివితేటలతో ఎడారిలో ఇసుకను సైతం అమ్మేస్తుంటారు. గాడిదలతో కూడా మోసం చేసి లక్షలు సంపాదించవచ్చని నిరూపించాడు ఓ వ్యక్తి. ఒకప్పుడు గాడిదను చిన్నచూపు చేసేవారు. పైగా అడ్డమైన తిట్లకు గాడిదనే వాడుకునేవారు. ప్రస్తుతం గాడిద, దాని పాలకొండే విలువతో గాడిద రేటు అమాంతం పెరిగిపోయింది. ఊళ్లలో కూడా గాడిదను వెంటేసుకుని తిరుగుతూ కనిపిస్తున్నారు. ఈ గాడిద పాలను ఎంతైనా సరే ఇచ్చి కొనుక్కునేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
గాడిదలే పెట్టుబడి..
దీనితో తమిళనాడుకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా గాడిదల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది.
జనం వీక్ నెస్ ఎక్కువగా దేనిపై ఉంటుందో దాంతోనే వారిని బుట్టలో పడేయొచ్చని సదరు వ్యక్తి గాడిదలనే పెట్టుబడి వ్యాపారంగా మలుచుకున్నాడు. దీనికి ఏకంగా ఓ యూట్యూబ్ ఛానల్ నే మొదలుపెట్టాడు. తన వీడియోలను ప్రతిరోజూ లక్షల సంఖ్యలో జనాలకు షేర్ చేస్తుండేవాడు.
ఆన్ లైన్ లో వ్యాపారం
ఆన్ లైన్ ద్వారా కొందరు ఈ గాడిద పాలను తాగి తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. క్యాన్సర్, షుగర్, కిడ్నీ వ్యాధులు అనేకమైనవి కేవలం గాడిద పాలతోనే నయం చేసుకున్నామంటూ ఊదరగొట్టే వీడియోలు తయారుచేసి మార్కెట్లో రిలీజ్ చేయించాడు. కావాలని కొందరు సెలబ్రిటీలకు డబ్బుల ఎర చూపి వారితోనూ వీడియోలు చేయించడంతో అందరూ అదే నిజమని నమ్మి సదరు వ్యక్తి ప్రారంభించిన డాంకీ ఆన్ లైన్ బిజినెస్ లో లక్షలు ఇన్వెస్ట్ చేశారు.
రూ.100 కోట్ల వ్యాపారం
డాంకీ ఫాం హౌస్ పేరుతో బాబు ఉలగనాథన్ వందలు, వేల సంఖ్యలో గాడిదలను చూపించి వాటిని అమ్మే ప్రయత్నం చేశాడు. ఒక్కో గాడిదపై నెలకు రూ.5నుంచి 6 లక్షల వరకూ లాభం వస్తుందని నమ్మించాడు. పైగా గాడిద పాలు లీటరుకు రూ.2 వేల రూపాయల దాకా రాబడి వస్తుందని నమ్మించాడు. దాంతో ఉలగనాథన్ గాడిదలను లక్షల్లో పోసి జనం కొనుక్కోసాగారు. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లో కూడా ఉలగనాథన్ వీడియోలు ఫేమస్ అయ్యాయి. లక్షలకు లక్షలు పోసి గాడిదలను కొనుగోలుచేసేవారి సంఖ్య పెరిగిపోయింది. అలా వందలాది మందిని మోసం చేసి రూ.100 కోట్లుకు పైగా పబ్లిక్ సొమ్ము కాజేశాడు.
భారీ సెమినార్లు
అప్పుడప్పుడు లక్షలు ఖర్చుపెట్టి భారీ సెమినార్లను కూడా నిర్వహించాడు. విషయం ఏమిటంటే ఈ సెమినార్లకు తమిళనాడు డైరీ డెవలప్ మెంట్ అధికారులు కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఉలగనాథన్ అక్రమ వ్యాపారంలో వీరికి కూడా వాటా ఉందా అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తన గ్రూప్ లో సభ్యులను చేర్చుకుని సభ్యత్వం పేరుతో రూ.5 లక్షలు తీసుకునేవాడు. నెలకే కేవలం మూడు నుంచి నాలుగు లక్షల ఆదాయం వస్తుందని నమ్మి జనం ఉలగనాథన్ గాడిదల కంపెనీ సభ్యత్వం తీసుకుని అతనికి డిపాజిట్ గా రూ.5 లక్షలు సమర్పించుకున్నారు.
గాడిద వైద్యం
తమ కంపెనీలో డిపాజిట్లు తీసుకున్నవారికి తన వద్ద గాడిదల స్పెషలిస్ట్ వైద్యుడు ఉన్నాడని..గాడిదలకు జబ్బు రాకుండా అతనితో మందులు సైతం కొనిపించాడు. మొల్లగా ఉలగనాథన్ చేస్తున్న మోసాలు వెలుగులోకి రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈలోగా ఉలగనాథన్ తన కంపెనీ మూసేసి ఎటో పారిపోయాడు. ఏపీలోనూ ఉలగనాథన్ బాధితులు మంత్రి లోకేష్ ని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. నిందితుడిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. తమిళనాడులో సీఎం స్టాలిన్ ని కలిసి బాధితులు జరిగిన మోసం విన్నవించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. ప్రస్తుతం పోలీసులు ఉలగనాథన్ కోసం గాలింపు చర్యలు ఉధృతం చేశారు. మొత్తానికి తనని నమ్మినవారిని గాడిదలు చేశాడు ఉలగనాథన్.