AP Govt: చంద్రబాబు సర్కార్లో నామినేటెడ్ పదవులకు డిమాండ్ అంతా ఇంతా కాదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేతల మధ్య పోటీ విపరీతంగా ఉండేది. అయినా అధిష్టానాన్ని కన్వీన్స్ చేసి పదవులు తెప్పించుకునేవారు కొందరు నేతలు. ఇప్పుడు సీన్ మారింది. కూటమిలో మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామి ఉన్నాయి. ఇప్పుడు ఆశావహుల లిస్టు రోజురోజుకూ పెరుగుతోంది.
నామినేటెడ్ పోస్టుల కంటే ఆలయాల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో నామినేటెడ్ పదవులు జాబితా రోజు రోజుకూ పెరిగిపోతోంది. నామినేటెడ్ పోస్టులు.. పార్టీలో నేతలు, చేసిన సేవలు బట్టి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కేటాయిస్తోంది. అంతేకాదు గట్టిగా మాట్లాడేగలిగే వ్యక్తులకు పెద్ద పీఠ వేస్తోంది.
ఆలయాల పాలక మండళ్లపై దృష్టి
కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు దక్కడమంటే ఆషామాషీ విషయం కాదు. అయినా ఆశావహులు మాత్రం పట్టు వీడడం లేదు. తమ వంతు ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నారు కూడా. నామినేటెడ్ పదవులు ఆలస్యమైన కొద్దీ దిగువస్థాయిలో అసహనం క్రమంగా పెరుగుతోంది. తొలుత నామినేటెడ్ పోస్టులు భర్తీ తర్వాత దేవాలయాల పాలక మండళ్లపై ఫోకస్ చేయాలన్నది టీడీపీ ఆలోచనగా కొందరు నేతలు చెబుతున్నారు.
ఇందుకు కారణాలు లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 76 దేవాలయాలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం 143 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఆయా పనులు పూర్తి అయ్యేలోపు ఆలయాల పాలక మండలి జాబితా రెడీ చేయాలనే ఆలోచన చేస్తోందని సమాచారం.
ALSO READ: సరియా జలపాతం.. ఇద్దరు మిస్సింగ్, అసలేం జరిగింది?
ఏపీలో కీలకమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో విజయవాడ-దుర్గ గుడి, శ్రీశైలం-మల్లిఖార్జున, విశాఖ-నరసింహాస్వామి, అన్నవరం-సత్యనారాయణ స్వామి దేవాలయాలతోపాటు కీలకమైనవి ఉన్నాయి. వాటి పాలక మండళ్లలో చోటు దక్కించుకునేందుకు దిగువస్థాయి నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీటికి ఫుల్ డిమాండ్ ఉంది.
కండువాలు మార్చినవారు రేసులో
పార్టీ కోసం కష్టపడ్డామని మాకేంటి అంటూ రిక్వెస్టుల మీద రిక్వెస్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆలయాల్లో స్థానం కోసం నేతలు ఎగబడుతున్నారు. దిగువస్థాయి నేతల ఒత్తిడి చేయడంతో త్వరగా తేల్చాలని ఎమ్మెల్యేలు హైకమాండ్కు విన్నవించుకుంటున్నారు. మిమ్మల్ని నమ్ముకున్నామని కొందరు నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన నేతలు ఆయా పోస్టులను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాట ఇచ్చి తమను ఆహ్వానించి కండువాలు కప్పారని, మా పరిస్థితి ఏంటని అంటున్నవాళ్లూ లేకపోలేదు. పొత్తులు ఉండడంతో మూడు పార్టీల నుంచి ఆశావహుల జాబితా పెద్దదిగా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్లు ఎన్ని ఉన్నా, ఆలయాలకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది.
నామినేటెడ్ పోస్టులు కాకున్నా, వీటిలో నైనా చోటు కల్పిస్తే.. దేవుడి సేవ అయినా దక్కుతుందని అంటున్నారు ఆశావహులు. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాకు కాసింత కష్టాలు లేకపోలేదు. దేవాలయాలు అయితే దేవుడే దారి చూపిస్తున్నారని అంటున్నారు. ఈ స్థాయి పోటీ నేపథ్యంలో దేవాలయాల పాలక మండళ్ల పదవులు కూటమి సర్కార్ ఏ విధంగా భర్తీ చేస్తారో చూడాలి.