Global Investors Summit: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ హంగామా మొదలైంది. భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమ్మిట్ను నిర్వహిస్తోంది. ఈ నెల 3, 4 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని జగన్ సర్కార్ ఆశిస్తోంది. ఇప్పటికే ఈ సమ్మిట్ కోసం 12 వేలకు పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. 35 మంది దేశీయ టాప్ ఇండస్ట్రియలిస్టులతో పాటు 25 దేశాలకు చెందిన దిగ్గజ వ్యాపారస్థులు, హైకమిషనర్లు సమ్మిట్కు జరుకానున్నారు.
దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, అదానీ, ఆదిత్య బిర్లా, మిట్టల్ వంటివారితో పాటు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఇక కార్యక్రమానికి రానున్న అతిథుల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది జగన్ సర్కార్. ఎయిర్పోర్టు నుంచి సమ్మిట్ జరగనున్న ప్రాంతానికి వచ్చేందుకు వీలుగా హెలికాప్టర్లతో పాటు ఖరీదైన లగ్జరీ కార్లను సిద్ధం చేశారు. అలాగే అతిథులు బస చేయడం కోసం ప్రముఖ హోటళ్లలో 800పైగా గదులని బుక్ చేశారు. అతిథులు విశాఖ ఎయిర్పోర్టులో దిగినప్పటి నుంచి వారిని హోటల్కు తీసుకెళ్లి అక్కడి నుంచి సమ్మిట్కు తీసుకెళ్లేందుకు పలు విభాగాలకు చెందిన ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించారు.
ఇక ఈ సమ్మిట్పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైజాగ్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ విజయంవంతం కావాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ స్థానంలో ఉండాలని పేర్కొన్నారు.