తల్లీ, చెల్లీ… ఏ గల్లీలో లేని సిల్లీ నా కొడుకును…! ఈ డైలాగ్ గుర్తుందా? చాలా ఏండ్ల కిందట వచ్చిన రౌడీ గారి పెళ్లాం సినిమాలోని మోహన్బాబు ఫేమస్ డైలాగు. అక్కడ ఆ సినిమాలో ఆ డైలాగును గర్వంగా చెప్పుకుంటాడు. ఇక్కడ ఇప్పుడు నిజ జీవితంలో కవిత మాత్రం ప్రతినాయకుడి పాత్రలు వేస్తున్న బీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ను ఉద్దేశించి ఈ మాటన్నారు.
ఎప్పుడైతే కవిత .. బీఆరెస్ పార్టీని వీడారో.. అప్పట్నుంచే ఆమెపై సోషల్ మీడియాలో దాడి షురూ అయ్యింది. పార్టీ పెట్టిన తరువాత.. ఆమె బీఆరెస్పై పెంచుతున్న నిరసన గళం .. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో నిగ్రహం కోల్పోయేలా చేస్తోంది. దీంతో అప్పటి వరకు కొంచెం సహనం వహించిన ఆ టీమ్.. అదే కేటీఆర్ టీమ్.. కవితపై విచక్షణారహితంగా కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు.
ఈ విషయంపై పలుమార్లు కవిత వార్నింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు. దీంతో ఇవాళ మరీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు కవిత. కొత్తగూడెం బాయిబాట కార్యక్రమంలో ఉన్న ఆమె.. ఈ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో మహిళలంటే గౌరవం ఉంటుందని గుర్తు చేశారు. హద్దులు మీరి ప్రవర్తిస్తే బుద్ది చెప్పక తప్పదన్నారామె. ఇది ఆంధ్రా కాదు.. తెలంగాణ. ఇష్టమొచ్చినట్టు వ్యక్తిగతంగా తిడతామంటే ఊరుకునేది లేదు.. కాళ్లు విరగ్గొట్టి.. చేతుల పెడతం.. అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
మీకు తల్లీ, చెల్లీ ఉంటే .. వారి పట్ల ఎట్లా ఉంటారో ఆలోచించుకుని కామెంట్లు చేయాలని హితబోధ చేశారు. అయినా మీ విధానం మారలేదంటే.. మీకు తల్లీ, చెల్లీ విలువ, వారికిచ్చే మర్యాద తెలియదనే అనుకోవాల్సి వస్తుందని, అప్పుడు మా తడాఖా చూపిస్తామన్నారు. ఏదైనా విమర్శ చేయొచ్చన్నారు. కానీ వ్యక్తిగతంగా తిట్టడం, మార్ఫింగు వీడియోలు చేసి పెట్టడం లాంటివి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఊరు, పేరు లేని ఐడీలతో ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారని, దమ్ముంటే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని ఆమె సవాల్ విసిరారు.
ఇక్కడ ఆమె ఆంధ్రా సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పుడు అక్కడ సోషల్ మీడియా రగడ నడుస్తోంది. హద్దులు మీరి మరీ వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడం, నేరుగా వీడియోలు తీయడం.. ఇవన్నీ కామన్. కేసులు, అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఆంధ్రాలో పార్టీలు వీటిని బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. అక్కడ ఎంతగా రాజకీయ చైతన్యముందో.. అంతగా.. సోషల్ మీడియా హద్దులు మీరిపోయి ఉంది.
కానీ తెలంగాణలో అలా కాదు.. కాళ్లు విరగ్గొట్టి చేతిలో పెడతామని కవిత వార్నింగ్ ఇవ్వడం కూడా చర్చకు తెర తీసింది. తెలంగాణలో ఏ పార్టీలో లేని విధంగా తమ పార్టీలో యూత్ ఉన్నారని, కానీ, మీలా దిగజారుడు కామెంట్లు పెట్టమని, విజ్ఞతతో ఉంటామని ఆమె చెప్పుకొచ్చారు. ఓ వైపు కేటీఆర్ను గట్టిగానే అర్సుకున్న కవిత.. కేటీఆర్ పెంచిపోషిస్తున్న బీఆరెస్ సోషల్ మీడియాకు కూడా తనదైన శైలిలో వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు రెండు పార్టీల మధ్య జరుగుతున్న మాటల వార్కు సంకేతంగా నిలిచింది.