Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఆదివారం కాస్త చల్లగా ఉన్నా, సోమవారం ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంటోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓ రేంజ్లో ఎండలు కావడంతో బయటకు వెళ్లేందుకు భయపడ్డారు.
ఉదయం 8 గంటల నుంచి భానుడి ప్రతాపం.. అల్లాడిపోతున్న జనం
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం నుంచి ఎండలు మరింత తీవ్రమయ్యాయి. ఉదయం నుంచి ఒకేలా సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. కాలు బయటకు పెట్టాలంటే చిన్నారులు హడలిపోతున్నారు. ఎండ వేడికి బయటకు రాలేక ప్రధాన నగరాల్లో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీనికితోడు తెలుగు పంచాంగం ప్రకారం అగ్ని కార్తె కాలం కావడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.
సోమవారం నుంచి గురువారం వరకు అంటే ఈనెల 23 వరకు వడ గాడ్పులు కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు ప్రజలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
అమాంతంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వారం పాటు ఇదే పరిస్థితి!
చాలా ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇది 48 డిగ్రీల వరకు వెళ్లవచ్చు. ఎల్నినో ఏడాది కావడం వల్ల ఎండల తీవ్రత, వేడి గాలులు సాధారణం కంటే చాలా ఎక్కువగా వీస్తాయని చెప్పారు.
2015 నాటి ఎల్ నినో పరిస్థితులను ఈ ఏడాది గుర్తు చేస్తున్నారు అధికారులు. అప్పట్లో తీవ్ర వడగాడ్పుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు.
ALSO READ: ఆర్టీసీని నడపడం చేతకాకపోతే మాకివ్వండి.. కూటమికి పేర్ని నాని సవాల్!
ఏపీలో ఇవాళ 28 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట మండలాలు దీని ప్రభావం ఉందని తెలిపింది.
ఇక విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాలు వడగాలుల బారిన పడే అవకాశం తెలియజేసింది.
హీట్ ఒక్కసారిగా పెరగడంతో నీరు పదే పదే తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. డీహైడ్రేషన్ను నివారించడానికి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్-ORS, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలను ఉపయోగించాలని పేర్కొంది. ఒకవేళ బయటకు ప్రయాణించేవారు తమ వెంట వాటర్ బాటిళ్లను తీసుకువెళ్లాలని సూచించింది. పుచ్చకాయ, కర్బూజా, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయలు వంటి అధిక నీటి శాతం ఉన్న పండ్లు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.