Botsa Satyanarayana: ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. గడిచిన నాలుగు రోజులుగా అసెంబ్లీలో ఇంటా బయటా హెరిటేజ్ కంపెనీపై వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. పలుమార్లు వైసీపీ నేతలను టీడీపీ హెచ్చరించింది. అయినా కొందరి నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు హెరిటేజ్ సంస్థ.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్గా మారింది.
చిక్కుల్లో వైసీపీ సీనియర్ నేత బొత్స.. హెరిటేజ్ సంస్థ నోటీసులు
ఏపీలో రాజకీయాలు న్యూ టర్న్ తిరిగాయి. మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఊహించని షాక్ ఇచ్చింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ ఆ కంపెనీ అడ్వకేట్ మల్లికార్జున రావు లీగల్ నోటీసు జారీ చేశారు.
దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని పొందిన హెరిటేజ్ సంస్థపై చేస్తున్న తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని అందులో పేర్కొంది. హెరిటేజ్ సంస్థను అత్యున్నత ప్రమాణాలతో పారదర్శక విధానాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, గుర్తింపు పొందిందని ఆ సంస్థ గుర్తు చేసింది. రీసెంట్గా రెండురోజులుగా హెరిటేజ్ కంపెనీపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
టీటీడీ నెయ్యి సరఫరా వ్యవహారం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ఒకానొక దశలో ప్రతిపక్షనేత బొత్స ప్రెస్ మీట్ పెట్టి ఆ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేశారన్నది ఆ కంపెనీ ప్రధానంగా పేర్కొంది. దాని ఆధారంగా ఫిబ్రవరి 18న పలు ఛానెళ్లు, పత్రికలు కథనాలను ప్రచురించాయి. ఇందాపూర్ డైరీతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేకపోయినా 2014-19 మధ్య ఆ సంస్థ పేరుతో టీటీడీకి నెయ్యి సరఫరా చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేశారని ప్రస్తావించింది.
దాదాపు 22 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్ ఏర్పాటు చేసిందంటూ అందులో పేర్కొన్నారు. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారని సంస్థ తెలిపింది. పదేపదే తప్పుడు ఆరోపణలు చేసి హెరిటేజ్పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశారని నోటీసులో ప్రస్తావించింది. సెక్షన్ 356 ఆఫ్ బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం.. పరువు నష్టం కలిగించినందుకు సదరు కంపెనీకి బొత్స సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
ALSO READ: నన్ను చంపేందుకు ప్రయత్నించారు.. వెనక్కి తగ్గేది లేదన్న అంబటి
బొత్స చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని కోరింది. లేని పక్షంలో సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటుందంటూ నోటీసులో హెచ్చరించింది. లీగల్ నోటీసు జారీ చేసినందుకు అక్షరాలా లక్ష రూపాయలు వెంటనే చెల్లించాలని పేర్కొంది. ఈ నోటీసు వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. దీనిపై మండలి ప్రతిపక్ష నేత బొత్స ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.