తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే లడ్డూను కల్తీ చేశారని గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి. అందులో వినియోగించే నెయ్యిని జగన్ ప్రభుత్వం కల్తీ చేసిందని, జంతువుల కొవ్వుతో,రసాయనాలతో తయారైన నెయ్యిని పవిత్రమైన లడ్డూ తయారీలో వాడారని అప్పటి ప్రతిపక్షం.. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. గత ఎన్నికల ముందు సైతం ఇదే తరహా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాము అలాంటి పనులు చేయలేదని వైసీపీ తమ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక తిరుమల లడ్డూ పవిత్రతపై సిట్ వేసి విచారణకు ఆదేశించింది.
తిరుమల తిరుపతి లడ్డూకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తిరుమల లడ్డూకు ఉండే సువాసన, రుచి మిగతా దేవస్థానాల్లో దొరికే ప్రసాదానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అందులో ఉపయోగించే పదార్ధాలు, ముఖ్యంగా నెయ్యి కలపడం వల్లే తయారు చేసేవారు సెలవిచ్చారు. అయితే, గత వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన అన్యమతస్తుడు అని కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.అటువంటి వ్యక్తి బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలో లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని, జంతు అవశేషాలతో తయారు చేసిన నెయ్యిని అందులో కలిపారని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే దీనిపై కొంతకాలంగా విచారణ జరిపిన సిట్.. నెయ్యి కల్తీ జరిగిందని ఇటీవల ప్రకటన చేసింది.దీంతో అధికార కూటమి నేతలు వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.దీనికి తోడు రాష్ట్రంలోని పలుచోట్ల నెయ్యి కల్తీ చేసిన జగన్.. వైసీపీ నేతలు అంటూ పెద్దఎత్తున ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.దీంతో వైసీపీ నేతలు, టీడీపీ నేతల మధ్య అగ్గి రాజుకుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు, జోగి రమేశ్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు ఆ ఇద్దరు నేతల ఇంటిపై దాడికి పాల్పడ్డారు.
తాజాగా లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు.ఈ వ్యవహారాన్ని అంత తేలికగా వదిలేది లేదని స్పష్టంచేశారు. అంతేకాకుండా బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. జగన్ చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని.. మరింత అనుభవించే సమయం ఆసన్నమైందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలాఉంటే, లడ్డూలో కల్తీ నెయ్యి కలపలేదని సీబీఐ చెప్పిందని.. సిట్ నివేదిక తప్పులతడక అని వైసీపీ నేతలు అంటున్నారు. కావాలనే తమ పార్టీ మాజీ మంత్రులపై దాడులు చేస్తున్నారని.. అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తున్నారని వారు మండిపడుతున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు అందరి లెక్క తేలుస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. కాగా, లడ్డూ వ్యవహారన్ని ఇంకెంతకాలం సాగదీస్తారని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తున్నది.