VC Sajjanar: బెంగళూరులో జరిగిన ఈ హృదయవిదారక ఘటన మానవత్వం మంటగలిసిన వేళ.. ఒక సామాన్య మహిళ చూపిన అసాధారణ ధైర్యం, సంస్కారానికి నిదర్శనం. కళ్ళముందే ప్రాణాలు పోతున్నా పట్టించుకోని యాంత్రిక సమాజానికి, రూప అనే మహిళ తన భర్త కళ్ళను దానం చేయడం ద్వారా ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది.
బెంగళూరులోని బనశంకరి ప్రాంతానికి చెందిన వెంకటరమణన్ (34) అనే వ్యక్తి నడిరోడ్డుపై అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఆయన భార్య రూప అభాగ్యురాలిలా రోడ్డుపై వెళ్లే వాహనదారులను సాయం కోసం అర్థించింది. చేతులెత్తి మొక్కుతూ.. తన భర్తను ఆసుపత్రికి చేర్చమని ప్రాధేయపడింది. వందల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నా, సెల్ఫోన్లలో వీడియోలు తీసేవారే తప్ప, ప్రాణం కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. ఫలితంగా.. సరైన సమయానికి వైద్యం అందక వెంకటరమణన్ అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ వీడియోలో రూప పడుతున్న తపన, ఆమె కళ్లలో కనిపిస్తున్న ఆర్తి ఎందరినో కలచివేసింది. ‘కళ్ళుండి కూడా తన బాధను చూడలేని లోకానికి తన భర్త కళ్ళతోనే చూపునివ్వాలని’ ఆమె తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. తన భర్త ఆపదలో ఉన్నప్పుడు స్పందించని ఈ ‘గుడ్డి’ సమాజంపై ఆమె ద్వేషం పెంచుకోలేదు. బదులుగా.. తన భర్త మరణానంతరం ఆయన నేత్రాలను దానం చేసి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపింది.
రూప తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక గొప్ప సందేశం ఉంది. ‘సమాజం నా భర్త ప్రాణాలు కాపాడటానికి రాలేదు.. కానీ నేను మానవత్వంతో మరో ఇద్దరికి కంటిచూపు ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అని ఆమె చెప్పిన మాటలు సమాజపు ఉదాసీనతను ప్రశ్నిస్తున్నాయి. సాయం చేయడానికి చేతులు రాని లోకంలో ఇతరులకు చూపునివ్వాలనే ఆమె సంస్కారం వెలకట్టలేనిది. తన వ్యక్తిగత విషాదాన్ని పక్కన పెట్టి సాటి మనిషికి మేలు జరగాలని కోరుకున్న ఆమె గొప్ప మనసు మనందరికీ ఆదర్శం.
కళ్లుండి కూడా తన బాధను చూడలేని లోకానికి.. తన భర్త కళ్లతోనే 'చూపు'నిచ్చింది!🙏
నడిరోడ్డుపై భర్త ప్రాణాల కోసం ఆమె పడ్డ తపనను, ఆ కన్నీటిని చూసేందుకు ఈ సమాజానికి కళ్లు చాలలేదు.. మనసు రాలేదు.
ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని ఈ 'గుడ్డి' సమాజంపై ఆమె పగ పెంచుకోలేదు. కళ్లున్నా గుడ్డిలా… pic.twitter.com/hLp3Yp0gnc
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 18, 2025
నేటి వేగవంతమైన ప్రపంచంలో పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే స్వార్థం పెరిగిపోతోంది. కానీ రూప వంటి వారు నిరూపించేది ఏమిటంటే.. మానవత్వం ఇంకా చచ్చిపోలేదని. కళ్ళముందు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మన కనీస బాధ్యత. రూప గారి ఉదంతం మనకు నేర్పే పాఠం ఒక్కటే.. ‘మనిషిగా పుట్టినందుకు తోటి మనిషికి సాయపడటమే అసలైన సంస్కారం.’ ఆమె చేసిన ఈ త్యాగం, సందేశం ఎప్పటికీ స్మరణీయంగా నిలిచిపోతాయి.
ALSO READ: YS Jagan: జగన్ ఫ్లెక్సీకి మేకపోతు బలి ఇచ్చారు.. అంతలోనే సీన్ కట్ చేస్తే.. నడిరోడ్డుపై?