మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్లో కళ్లు చెదిరే స్థాయిలో భారీ బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ ఆవిష్కరణ ప్రపంచ ఖనిజ వనరుల అంచనాలను ఒక్కసారిగా మార్చేయడమే కాకుండా.. అంతర్జాతీయ బంగారు సరఫరా గొలుసులో చైనా ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం, పింగ్జియాంగ్ కౌంటీలోని ‘వాంగు’ (Wangu) గోల్డ్ ఫీల్డ్లో లభ్యమైన ఈ నిక్షేపాలు ప్రపంచంలోని ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద నిక్షేపాలను మించిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
హునాన్ ప్రావిన్స్ జియోలాజికల్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం.. భూగర్భంలో సుమారు 2,000 మీటర్ల లోతులో 40కి పైగా విభిన్న బంగారు గనులను గుర్తించారు. ప్రస్తుతం సుమారు 300 టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణ కాగా.. ఇంకా జరుగుతున్న అన్వేషణల ద్వారా ఈ మొత్తం 1,000 మెట్రిక్ టన్నుల మార్కును దాటవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నిక్షేపాల విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం సుమారు 600 బిలియన్ యువాన్లు (దాదాపు 83 బిలియన్ అమెరికన్ డాలర్లు) ఉంటుందని అంచనా.
వాంగు నిక్షేపం కేవలం పరిమాణంలోనే కాదు.. నాణ్యతలోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వాణిజ్య గనుల్లో ఒక టన్ను ఖనిజం నుంచి 10 గ్రాముల కంటే తక్కువ బంగారం లభిస్తుంది. కానీ, ఇక్కడ సేకరించిన నమూనాలలో ఒక టన్ను ఖనిజానికి గరిష్టంగా 138 గ్రాముల వరకు బంగారం ఉన్నట్లు తేలింది. అనేక చోట్ల భూమి పొరల్లో ‘కంటికి కనిపించే బంగారం’ లభ్యమైందని నిపుణులు పేర్కొన్నారు. ఇది ఆ ప్రాంతంలో ఖనిజ సాంద్రత ఎంత ఎక్కువగా ఉందో సూచిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిగా దక్షిణాఫ్రికాలోని ‘సౌత్ డీప్’ కొనసాగుతోంది. అక్కడ సుమారు 900 మెట్రిక్ టన్నుల నిక్షేపాలు ఉన్నాయి. ఒకవేళ చైనాలోని వాంగు నిక్షేపాలు పూర్తిగా గుర్తిస్తే.. ఇది దక్షిణాఫ్రికా రికార్డును అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. తక్కువ ఖనిజంతో ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉండటంతో.. ఇది అత్యంత లాభదాయకమైన ప్రాజెక్టుగా మారనుంది.
ఈ తరహా భారీ నిక్షేపాలు ఎలా ఏర్పడతాయనే అంశంపై నేచర్ జియోసైన్స్ మ్యాగజైన్లో ఆసక్తికరమైన కథనం ప్రచురితమైంది. భూకంప ఒత్తిడి వల్ల క్వార్ట్జ్ శిలలలో ఏర్పడే ‘పైజోఎలెక్ట్రిసిటీ’ (Piezoelectricity) కారణంగా.. భూగర్భ ద్రవాల నుంచి బంగారం వేగంగా వేరుపడి గడ్డకడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాంగు ప్రాంతంలోని భౌగోళిక నిర్మాణాలు ఈ సిద్ధాంతానికి బలం చేకూరుస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ బంగారు ఉత్పత్తిలో చైనా వాటా 10 శాతంగా ఉంది. 2023లో చైనా 370 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ కొత్త నిక్షేపంతో చైనా తన రిజర్వులను భారీగా పెంచుకోనుంది. హునాన్ మినరల్ రిసోర్సెస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. కేవలం ఆభరణాల కోసమే కాకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ తయారీలో బంగారం కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఈ ఆవిష్కరణ చైనాకు వ్యూహాత్మక విజయంగా పరిగణించవచ్చు.
రాబోయే 2025 నాటికి మరిన్ని నిక్షేపాలను వెలికితీయాలని చైనా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ నిక్షేపం చైనా ఆర్థిక వ్యవస్థకే కాకుండా.. ప్రపంచ మార్కెట్లలో బంగారు ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ALSO READ: Top 20 News: కైలాసగిరిపై తప్పిన పెను ప్రమాదం.., మావోయిస్టులకు వ్యతిరేకంగా.. రోడ్డుపై నిరసన