AP Temple Tragedies: ఏపీలో అసలేం జరుగుతోంది? చీటికి మాటికీ దేవాలయా ల వద్ద ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? గత పాలకుల పాపం వెంటాడుతుందా? ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యమా? అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదా? తప్పులు ఎవరి చేసినా అనుభవించేది అన్నెంపుణ్యం ఎరుగని భక్తులా? నాలుగు నెలల్లో రెండు ఘటనలా? ఏమైంది యంత్రాంగం? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల వద్ద ఘటనలు జరుగుతున్నాయి. గడిచిన నాలుగు నెలల్లో ఇది రెండో ఘటన. తొలుత తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఘటన కాగా, ప్రస్తుతం సింహాచలం దేవస్థానం( చందనోత్సవం) వంతైంది. కలియుగ వేంకటేశ్వరుడు మరో అవతారంగా సింహాద్రి అప్పన్నను భావిస్తారు భక్తులు. ఈ రెండు ఘటనలు ఆ స్వామి సన్నిధిలో జరగడంతో ఏం జరుగుతోందని సగటు భక్తులు చర్చించుకోవడం మొదలైంది.
స్వామికి ఎక్కడో తెలియని తప్పు చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి ఘటనలు జరగడమేంటి? ఒక్కసారి ఏపీలోని కీలకమైన దేవాలయాల్లో శుద్ధి చేయాలన్నది కొందరు పండితుల మాట. అప్పటికైనా దేవుడి ఆగ్రహం చల్లారుతుందని అంటున్నారు.
తిరుపతిలో ఏం జరిగింది?
జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. అదే నెల 10 నుంచి 12 వరకు (మూడు రోజులకు) 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భారీగా తరలి వచ్చారు భక్తులు.
ALSO READ: సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
రాత్రి వేళ దాదాపు 9 గంటల సమయంలో క్యూలైన్ల లోకి భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. భక్తులు లోనికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. టీటీడీ చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘటన జరిగింది. ప్రస్తుతం దానిపై లోతుగా విచారణ జరుగుతోందనుకోండి. అధికారుల నిర్లక్ష్యమా అనేది అది వేరే విషయం.
సింహాచలం వంతు
ఇక సింహాచలం దేవాలయం విషయానికి వద్దాం. తిరుపతిలో మాదిరిగా ఇక్కడ టికెట్లు వ్యవహారం.. పైగా చనిపోయింది భక్తులే. ఏడాదికి ఒకసారి స్వామి నిజరూపం దర్శనం కోసం వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉచిత క్యూ లైన్లతోపాటు రూ.300 దర్శనం లైన్లను ఏర్పాటు చేశారు అధికారులు. అదే సమయంలో రాత్రి సింహచలం పరిధిలో భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షానికి సింహాద్రి కొండలు తడిచి ముద్దయ్యాయి.
ఆలయ మెట్ల మార్గం వెంబడి రూ.300 దర్శనం టిక్కెట్ల కౌంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ మధ్యనే మెట్లకు దన్నుగా ఉండేలా రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఆ ప్రాంతంలో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయడం తప్పు. పైగా రిటైనింగ్ వాల్ ప్లైయాష్తో చేసిన లైట్ బ్రిక్స్తో నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణం నాసిరకంగా ఉండడంతో వర్షపు నీటితో ఆ ప్రాంతంలో భూమి మొత్తగా మారిపోయింది.
నిర్మాణ లోపాలు, పాపం భక్తుల వంతు?
రాత్రి కురిసిన వర్షానికి ఆలయ పరిసర ప్రాంతాల్లో వర్షం నీరు వచ్చి చేరింది. ఫలితంగా గోడ ఉన్నా వర్షపు నీరు, మట్టి బరువు అమాంతంగా పెరిగిపోయింది. గోడ బలంగా లేకపోవడంతో దాని దిగువునున్న గోడ.. భక్తులపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. లూజ్ సాయిల్ ఉన్న ప్రాంతాల్లో లైట్ బ్రిక్స్తో నిర్మాణం ఎలా చేపట్టారు అన్నది అసలు పాయింట్.
కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టినప్పుడు పునాదులతో కాంక్రీట్ నిర్మాణాలు చేయాలి? అక్కడా దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపించింది. గోడ కూలిన ప్రాంతంలో ఐరన్ మెష్ ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని, లేకుంటే ఈ విషాదాన్ని ఊహించుకోలేమని అంటున్నారు కొందరు భక్తులు. మొత్తానికి తెలియని తప్పు ఏదో చేసి ఉంటారని అందుకే స్వామి దగ్గర అలాంటి ఘోరం జరిగిందని అంటున్నారు.