Vijayawada: భవానీపురం, జోజి నగర్ ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేత వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ అధికారులు చేపట్టిన ఈ కూల్చివేతల ప్రక్రియకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. ఆ ఆర్డర్ చేతికి అందకముందే అధికారులు కూల్చివేతలను పూర్తి చేయడం గమనార్హం. మొదట, ఓ సొసైటీ దాఖలు చేసిన కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. దాదాపు 42 ఇళ్లను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఆకస్మిక చర్యతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు దాదాపు 200 మంది పోలీసులను మోహరించారు.
పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా.. అధికారులు కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో 42 ప్లాట్లలోని దాదాపు 15 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. తమ కళ్లముందే నివాసాలు నేలమట్టం కావడంతో ఇళ్ల యజమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ నేపథ్యంలోనే.. కూల్చివేతలను నిలుపుదల చేయాలని కోరుతూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం దీనిపై సానుకూలంగా స్పందించి కూల్చివేతలపై స్టే విధించింది. అయితే, ఈ స్టే ఆర్డర్ అధికారులకు చేరేలోపే ఇళ్ల కూల్చివేత ప్రక్రియ ముగియడం ఈ వివాదంలో ప్రధాన ట్విస్ట్.
సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూల్చివేతలు ఆగిపోయాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తమ నివాసాలు కూలిపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లను తిరిగి ఎవరు నిర్మించి ఇస్తారంటూ వారు ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నిస్తున్నారు. తమ జీవితకాలపు పొదుపుతో కట్టుకున్న ఇళ్లు క్షణాల్లో కూలిపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాధితులు ఉన్నారు. కూల్చివేతకు గురైన ఇళ్ల బాధితులకు న్యాయం జరగాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సర్వత్రా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
ALSO READ: CM Chandrababu: దివ్యాంగులకు శుభవార్త.. ఏడు వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు