WTC 2025-27 points table: టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ {WTC} ఫైనల్ ఆశలపై గౌహతి టెస్ట్ నీళ్ళు చల్లింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండు టెస్టులలో విజయం సాధించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో దూసుకుపోదాం అనుకున్నా టీమ్ ఇండియాకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
దీనికి ముందు ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ని 2 – 2 తో డ్రా చేసుకొని మంచి ఊపుమీద కనిపించిన టీమిండియా.. సొంత గడ్డపై పేలవ ప్రదర్శనతో పరాభవాన్ని చవిచూసింది. తొలి టెస్ట్ లో 120 పరుగుల లక్ష్యాన్ని కూడా చేదించలేక ఓడిపోయిన భారత జట్టు.. రెండవ టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడిపోయింది.
గౌహతి టెస్ట్ లో ఓటమి తర్వాత భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి దిగజారింది. మొత్తం 18 మ్యాచ్ ల సైకిల్ లో భారత్ ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడింది. ఇందులో తొమ్మిది మ్యాచ్ లలో భారత్ కి దక్కింది 48.15 పాయింట్లు మాత్రమే. దీంతో ఇక మిగిలిన మరో 9 టెస్ట్ లలో దాదాపు ఖచ్చితమైన ఫలితాలు అవసరం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక గౌహతి టెస్టులో విజయం సాధించిన సౌతాఫ్రికా రెండవ స్థానానికి చేరింది. మరోవైపు శ్రీలంక, పాకిస్తాన్ జట్లు భారత్ కంటే ముందుగా మూడు, నాలుగవ స్థానాలలో నిలిచాయి. ఇక భారత్ ఐదవ స్థానంలో నిలిచింది. మొన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న భారత్.. రెండవ టెస్ట్ లో కూడా సఫారీలపై ఓడి 5వ స్థానానికి పడిపోయింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వంటి ఫార్మాట్ లో ఒక్కో మ్యాచ్ ఎంతో విలువైనది. ఎందుకంటే ప్రతి జట్టు సమాన సంఖ్యలో మ్యాచులు ఆడకపోయినప్పటికీ.. విజయ శాతం ఆధారంగా ర్యాంక్ ని నిర్ణయిస్తారు. ఇదే విధానం భారత్ కి ప్రస్తుతం భారంగా మారింది. శత్రుదేశం పాకిస్తాన్ డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు ఆడింది కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే. అయితే వీటిలో సాధించిన ఫలితాలవల్ల వారి విజయ శాతం భారత్ తో పోల్చితే అధికంగా ఉంది.
Also Read: Suresh Raina: టీమిండియా ప్లేయర్లు దద్దమ్మలాగా ఆడితే, గంభీర్ ఏం చేస్తాడు
కానీ భారత్ ఎక్కువ మ్యాచ్ లు ఆడినందువల్ల.. ఒక్కో పరాజయం భారీ దెబ్బలా మారింది. భారత జట్టు ఇప్పటివరకు కనబరిచిన తీరు అంచనాలకు తగ్గట్లుగా లేదు. కొన్ని టెస్ట్ లలో బౌలర్లు బాగా ఆడితే.. బ్యాటింగ్ విభాగం విఫలమైంది. మరికొన్ని టెస్ట్ లలో బ్యాటింగ్ అద్భుతంగా ఉంటే.. బౌలర్లు నిరాశపరిచారు. ఈ క్రమంలో డబ్ల్యూటీసి తదుపరి దశల్లో భారత్ కి ముఖ్యమైన సిరీస్ లు ఎదురవుతున్నాయి. రాబోయే మ్యాచ్ లలో గెలవడం తప్ప టీమిండియా కు మరో మార్గం లేదు.