YS Jagan news today(AP political news): జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతుందని సీబీఐని ప్రశ్నించింది. దీనికి గల కారణాలను చెబుతూ నాలుగువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు విచారణ వేగంగా పూర్తి చేయాలని ఇద్దరు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.
న్యాయస్థానం ప్రశ్నలకు సీబీఐ న్యాయవాదులు రిప్లై ఇచ్చారు. డిశ్చార్జ్ పిటిషన్ కారణంగానే ఆలస్యమవుతోందని సీబీఐ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కారాదని వ్యాఖ్యానించింది కోర్టు. సీఎం అనే కారణంగానే విచారణ జాప్యం జరగకూడదని, విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని తెలిపింది. ట్రయల్ సుదీర్ఘం సాగితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని, విచారణ జరుపుతున్న కోర్టులే ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది ధర్మాసనం.
బెయిల్ రద్దు, కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని స్పస్టంచేసింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా మరో పిటిషన్ వేశారు. ఆయా పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది.