Jagan Plan: ట్రెండ్కి అనుగుణంగా మనుషులే కాదు.. రాజకీయాలు మారుతుంటున్నాయి. మారకుంటే నేతలకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఈ మధ్యకాలంలో వైసీపీ అధినేత జగన్.. పదే పదే మెడికల్ కాలేజీల అంశాన్ని ఎత్తుకోవడం వెనుక అసలు అర్థం ఏంటి? ఏపీలో బీజేపీ ఎదిగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించారా? అందుకే ఆ పార్టీని పదే పదే ఇరుకాటంలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
బీజేపీని ఢీ కొట్టిన జగన్
మెడికల్ కాలేజీల అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని భావిస్తోంది వైసీపీ. ఈ విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను బద్నామ్ చేసే పనిలో పడింది. ఈ విషయాన్నిపదే పదే జగన్ ప్రస్తావించడం వెనుక ఇదే కారణమని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఈ అంశంపై గురువారం మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం, కాసింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
మెడికల్ కాలేజీలు కట్టడానికి ముందుకొచ్చినవారిని తాము అధికారంలోకి రాగానే రెండు నెలల్లో జైలుకి పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం బీజేపీ నేతలకు ఎక్కడో బాగానే కాలింది. దీనిపై గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు ఆ శాఖ మంత్రి సత్యకుమార్.
అస్త్రాలు ప్రయోగం, కంగుతిన్న వైసీపీ సీనియర్లు
ఆ శాఖకు చెందిన మంత్రి తానేనని, ఈ విషయంలో సవాల్ విసురుతున్నానని అన్నారు. వైద్యశాఖ మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది తానేనని, తనను జైలుకు పంపే దమ్ము, ధైర్యం జగన్కు ఉందా? అని ప్రశ్నించారు. చేతనైతే సీబీఐ విచారణ తనపై వేయాలన్నారు. ఎవర్ని బెదిరిస్తారు? ఎవర్ని జైలుకు పంపుతారు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.
పీపీపీ విధానం తీసుకొచ్చిన నీతి ఆయోగ్, దాన్ని సమర్థించిన న్యాయమూర్తులు, ఈ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీని జైలుకు పంపుతారా? అంటూ మండిపడ్డారు. వందలాది మంది జగన్లు వచ్చినా ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని తేల్చేశారు. పదుల కేసుల్లో బెయిల్పై ఉన్న జగన్.. మళ్లీ జైలుకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు.
ALSO READ: గోదావరి జిల్లాలో మొదలైన సంక్రాంతి జోరు
బీజేపీ నుంచి ఈ తరహా రియాక్షన్ రాగానే వైసీపీలోని కొందరు సీనియర్లు కంగుతిన్నారు. దీనిపై మంత్రి సత్యకుమార్ ఆ స్థాయిలో మాట్లాడడం ఆ పార్టీలో కొందరు నేతలకు మింగుడుపడడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీని నేరుగా జగన్ ఢీ కొట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. అటు ఢిల్లీ స్థాయిలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది వైసీపీ. లోక్సభ సమావేశాల్లో MGNREGA పథకం పేరు మార్పు విషయంలో ఆ పార్టీ ఎంపీ అవినాష్రెడ్డి, ఆ పార్టీ తరపున వాయిస్ బలంగా వినిపించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును సెలక్ట్ కమిటీ లేకుంటే జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం అవేమీ పట్టించుకోలేదు, గురువారం ఆ బిల్లు లోక్సభలో పాసైంది కూడా. జరిగిన ఈ రెండు పరిణామాలు గమనిస్తున్నవారు మాత్రం బీజేపీతో జగన్ ఢీ కొట్టినట్టే ఉందని అంటున్నారు.