Attapur: నేటి సమాజంలో పిల్లల మనస్తత్వం మారుతోంది. చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు తమ భవిష్యత్తు కోసమే మందలిస్తున్నారన్న విషయాన్ని గ్రహించలేక, క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. మందలింపులను, చిన్నపాటి తిరస్కారాలను తట్టుకునే మానసిక స్థైర్యం నేటి తరం పిల్లల్లో లోపిస్తోందనడానికి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. అమ్మ ఫోన్ మాట్లాడవద్దని చెప్పిందన్న చిన్న కారణానికి ఓ పదహారేళ్ల బాలిక తనువు చాలించింది.
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూపాల్ నగర్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు మరియు స్థానికుల వివరాల ప్రకారం.. భూపాల్ నగర్లో నివాసముంటున్న లక్ష్మికి 16 ఏళ్ల కూతురు ఉంది. ఆ బాలిక నిత్యం ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటాన్ని గమనించిన తల్లి లక్ష్మి, ఫోన్ పక్కన పెట్టి బుద్ధిగా ఉండాలని, ఎక్కువగా ఫోన్ మాట్లాడవద్దని మందలించింది. తల్లి మందలింపును అవమానంగా భావించిన ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆవేశంలో విచక్షణ కోల్పోయి, ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మధ్యాహ్నం పని ముగించుకుని భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన తల్లి లక్ష్మికి, కూతురు విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో గుండెలు పగిలేలా రోదించింది. తన చిన్న మందలింపు కూతురి ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయానని ఆమె కన్నీరుమున్నీరైంది. వెంటనే సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ వాడకం, క్షణికావేశం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాయి.