Ysrcp Politics: ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటి? అధినేత ఉంటేనే నేతలు కనిపిస్తు న్నారా? లేకుంటే నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారా? అయినా కొందరు నేతలు పార్టీకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారా? పార్టీ హైకమాండ్కు కేడర్ ఫిర్యాదు వెనుక అసలేం జరిగింది? నేతలకు అధినేత జగన్ ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు? యాక్టివ్ కాకుంటే తప్పుకోవాలని సూచన చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జగన్ సీరియస్ వార్నింగ్ వెనుక
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయి ఏడాదిన్నర అయ్యింది. అయినా నేతలు, బలమైన కేడర్ ఇంకా యాక్టివేట్ కాలేదు. ఏదో తూతూ మంత్రంగా జగన్ పిలుపు మేరకు కొందరు నేతలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరికొందరు నేతలు నియోజక వర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఏపీలో వైసీపీ పరిస్థితి చూసినవాళ్లు.. ఇంకా ఆ పార్టీ ఉందా అంటూ చర్చించుకోవడం మొదలైంది.
గతవారం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. కేడర్ నుంచి సేకరించిన సమాచారాన్ని నేతల ముందు పెట్టి వారిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రిలాక్స్ అయ్యింది చాలు.. ఇకపై యాక్టివ్ కావాలని అధినేత గట్టిగా క్లాస్ పీకినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
యాక్టివ్ అవుతారా-తప్పుకుంటారా?
కేడర్ కష్టాలను పట్టించుకోకపోవడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారట అధినేత. చాలా విషయాల్లో నియోజకవర్గాల నేతలు అంటీ ముట్టనట్టుగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. నేతల తీరు మారకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇకపై స్పీడ్ పెంచాల్సిందేనని, ఇకపై ప్రతీ నెలా నేతల రిపోర్టులు పరిశీలిస్తానని అన్నట్లు తెలిసింది.
ఏడాదిన్నర అయినా ఇప్పటికీ నియోజకవర్గానికి నేతలు అందుబాటులో లేరట. ముఖ్యంగా కొందరైతే విదేశాల్లో ఉంటున్నారని ప్రస్తావించారట. మరికొందరు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత ఇబ్బందులు, వ్యాపారాలు ఉన్నా.. పార్టీ బలోపేతం కావాల్సిందేనని తేల్చిచెప్పారట. ఇకపై అందరూ యాక్టివ్ కావాలని ఆదేశించినట్టు గుసగుసలు మొదలయ్యాయి.
ALSO READ: ఇంటర్ విద్యార్థులకు టార్గెట్ ఫిక్స్.. కేవలం 50 రోజులు మాత్రమే
ఇటీవల కొన్ని కార్యక్రమాలకు జగన్ పిలుపు ఇచ్చారు. వాటికి కొందరు నేతలు హాజరయ్యారని, మరికొందరు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు జరగలేని నియోజకవర్గాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు తీరు మార్చుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానని తెగేసి చెప్పేశారట.
ఆసక్తి లేకుంటే తప్పుకోవాలని.. కొత్తవారిని ఛాన్స్ ఇస్తానని ఖరాఖండిగా తేల్చి చెప్పినట్టు నేతలు చర్చించుకుంటున్నారు. దీనిపై కొందరు నేతలు ‘ఆఫ్ ద రికార్డు’లో తలోవిధంగా చర్చించుకుంటున్నారు. అధినేత అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి 20 మంది నేతలకు వార్నింగ్ ఇచ్చారని, మరోసారి ఇంకొంతమందికి ఇవ్వవచ్చని అంటున్నారు. మొత్తానికి పాత నేతలను దూరంగా పెట్టే ప్రయత్నాలు వైసీపీలో మొదలైనట్టు తెలుస్తోంది.